భారతీయ అమెరికన్కు రూ.5.30కోట్ల జరిమానా, ఐదున్నరేళ్ల జైలు.. చేసిన నేరమేంటంటే..
ABN , First Publish Date - 2022-01-15T22:11:22+05:30 IST
అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఐపాడ్ స్కామ్లో ఓ భారతీయ అమెరికన్కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది.
న్యూ మెక్సికో: అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఐపాడ్ స్కామ్లో ఓ భారతీయ అమెరికన్కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు పరిహారంగా 7,13,619 డాలర్లు(రూ.5.30కోట్లు) చెల్లించాలని తీర్పునిచ్చింది. మూడేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో తుది తీర్పుని మేరీల్యాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు గురువారం వెల్లడించింది. ఈ కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు అమెరికన్లకు కూడా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం... క్రిస్టినా స్టాక్ (46) అనే మహిళా న్యూమెక్సికోలో ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పని చేసేది. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంటర్నెట్ని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో స్థానిక ప్రభుత్వం ఐపాడ్లు ఉచితంగా అందివ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా భారీ స్థాయిలో యాపిల్ కంపెనీ ఐపాడ్ కొనుగోలు చేసింది. ఈ వ్యవహారాలను క్రిస్టినా పర్యవేక్షించింది.
ఈ క్రమంలో వాటిని క్రిస్టినా పక్కదారి పట్టించింది. విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన ఐపాడ్లను భారతీయ అమెరికన్ అయిన సౌరభ్ చావ్లా(36)కి అందించింది. వాటిని సౌరభ్ చావ్లా.. ఈబేతో పాటు ఇతర ఈ కామర్స్ సైట్స్ ద్వారా విక్రయించారు. ఇలా వీరిద్దరు 2012 నుంచి 2018 వరకు సుమారు ఆరేళ్ల పాటు ఈ స్కామ్ కొనసాగించారు. మొత్తంగా ఆరేళ్లలో ఒక మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 74 కోట్లు) విలువ చేసే 3,000లకు పైగా ఐపాడ్లను అమ్మేశారు. చివరకు ఈ ఐపాడ్ స్కామ్ 2018లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. గురువారం మేరీల్యాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసులో తుది తీర్పుని వెల్లడించింది. క్రిస్టినా స్టాక్, సౌరభ్ చావ్లాతో పాటు మరో అమెరికన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. సౌరభ్కు 66 నెలల జైలు శిక్షతో పాటు ఐఆర్ఎస్కు పరిహారం రూపంలో రూ. 5.30కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది.