భారతీయ అమెరికన్ జర్నలిస్టుకు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం
ABN , First Publish Date - 2021-06-13T13:36:12+05:30 IST
అమెరికాలోని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్కు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం లభించింది. బజ్ఫీడ్ న్యూస్ సంస్థలో పని చేస్తున్న ఆమె, చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చైనా నిర్వహిస్తున్న నిర్బంధ శిబిరాలను వ్యక్తిగతంగా పరిశీలించిన తొలి జర్నలిస్టు మేఘానే.
ముస్లింలపై చైనా అకృత్యాలను బయటపెట్టిన మేఘ రాజగోపాలన్
న్యూయార్క్: అమెరికాలోని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్కు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం లభించింది. బజ్ఫీడ్ న్యూస్ సంస్థలో పని చేస్తున్న ఆమె, చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చైనా నిర్వహిస్తున్న నిర్బంధ శిబిరాలను వ్యక్తిగతంగా పరిశీలించిన తొలి జర్నలిస్టు మేఘానే కావడం గమనార్హం. ఆ వివరాలను బజ్ఫీడ్ సంస్థ వెల్లడించింది. చైనా మేఘ నోరు నొక్కేందుకు య త్నించిందని, కానీ ఆమె పట్టుదలతో లండన్ నుంచి పరిశోధనను కొనసాగించి, ముస్లింలపై చైనా ప్రభుత్వ దారుణాలను ఎండగట్టారని సంస్థ వివరించింది.
పులిట్సర్ పురస్కారం తనకు వస్తుందని ఏ మాత్రం ఊహించలేదని మేఘ చెప్పారు. తన వృత్తి నిర్వహణలో సాయంగా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మేఘతో పాటు టంపా బే టైమ్స్లో పని చేసే భారత సంతతి వ్యక్తి నీల్ బేడీకి కూడా పులిట్సర్ వరించింది. భవిష్యత్తులో నేరస్థులయ్యే వారిని చిన్నతనంలోనే గుర్తించేందుకు పాస్కో కౌంటీలో షరీఫ్ కార్యాలయం రూపొందించిన కార్యక్రమాన్ని బహిర్గతం చేసినందుకు బేడీకి పురస్కారం దక్కింది.