యూఎస్లో బ్యాంక్కు మిలియన్ల డాలర్లు మోసగించిన ఎన్నారై !
ABN , First Publish Date - 2020-09-17T18:52:11+05:30 IST
అమెరికాలోని బ్యాంక్కు ఓ ఎన్నారై మిలియన్ల డాలర్లు మోసగించాడు.
న్యూజెర్సీ: అమెరికాలోని బ్యాంక్కు ఓ ఎన్నారై మిలియన్ల డాలర్లు మోసగించాడు. న్యూజెర్సీకి చెందిన మార్బల్, గ్రానైట్ వ్యాపారం నిర్వహించే కంకారియా కంపెనీ యజమాని రాజేంద్ర కంకారియా(61) ఈ భారీ మోసానికి పాల్పడినట్లు తాజాగా న్యాయస్థానంలో వెల్లడైంది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సాయంతో కంకారియా అమెరికాలోని ఓ బ్యాంకు నుంచి మోసపూరితంగా ఏకంగా 17 మిలియన్ల డాలర్లు(రూ.1,251,922,500) రుణం పొందాడు.
2016 నుంచి 2018, మార్చి వరకు ఆయన ఇలా పలు దఫాలలో తనకు లేని స్థిర ఆస్తులను చూపిస్తూ... ఆన్లైన్ ద్వారా కంపెనీ ఉద్యోగుల సాయంతో బ్యాంకు అధికారులకు బురిడీ కొట్టించి ఈ భారీ రుణాన్ని పొందడం జరిగింది. తాజాగా ఈ కేసు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణకు రావడంతో కంకారియాను జడ్జి సుసాన్ డి. విజెంటన్ దోషిగా తేల్చారు. కాగా, దోషిగా తేలిన రాజేంద్ర కంకారియాకు 30 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ఒక మిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.