గంటలో 36 పుస్తకాలు.. భారత సంతతి బాలిక సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2021-04-11T15:37:38+05:30 IST

యూఏఈలో భారత సంతతికి చెందిన బేబీ కియారా అనే నాలుగేళ్ల బాలిక సరికొత్త రికార్డును సృష్టించింది.

గంటలో 36 పుస్తకాలు.. భారత సంతతి బాలిక సరికొత్త రికార్డు

అబూధాబీ: యూఏఈలో భారత సంతతికి చెందిన బేబీ కియారా అనే నాలుగేళ్ల బాలిక సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 105 నిమిషాల్లో 36 పుస్తకాలను చదివి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అతితక్కువ సమయంలో అనేక పుస్తకాలు చదివి బేబీ కియారా కొత్త రికార్డు సాధించిందంటూ ది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంగీకరించింది. తనకు పుస్తకాల్లో ఉన్న కలర్‌ఫుల్ బొమ్మలను చూడటమంటే చాలా ఇష్టమని, అందుకనే పుస్తకాలను చదివేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటానని బేబీ కియారా చెబుతోంది. డాక్టర్ కావడం తన ధ్యేయమని బేబీ కియారా తెలిపింది. 


గడిచిన ఏడాది కాలంలో బేబీ కియారా దాదాపు 200 పుస్తకాలు చదివినట్టు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. బేబీ కియారా ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్లిన సమయంలోనూ చేతిలో పుస్తకం తప్పకుండా ఉంటుందని తల్లిదండ్రులు తెలిపారు. ఇంత చిన్న వయసులోనే తమ కూతురు కొత్త రికార్డును సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. కాగా.. బేబీ కియారా తల్లిదండ్రుల స్వస్థలం చెన్నై. వారిద్దరూ అమెరికాలో ఉన్న సమయంలో బేబీ కియారా జన్మించింది. అనంతరం తల్లిదండ్రులిద్దరూ కూతురితో కలిసి అబూధాబీకి షిఫ్ట్ అయిపోయారు.

Updated Date - 2021-04-11T15:37:38+05:30 IST