US కార్మిక శాఖ కొత్త సొలిసిటర్గా భారతీయ అమెరికన్
ABN , First Publish Date - 2021-07-16T16:10:38+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన విభాగంలో మరో భారత సంతతి మహిళకు తాజాగా కీలక పదవి దక్కింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన విభాగంలో మరో భారత సంతతి మహిళకు తాజాగా కీలక పదవి దక్కింది. భారతీయ అమెరికన్ పౌర హక్కుల న్యాయవాది సీమా నందాను కార్మిక శాఖ కొత్త సొలిసిటర్గా అమెరికన్ సెనేట్ ధృవీకరించింది. సీమా నామినేషన్ను ధృవీకరించేందుకు బుధవారం సెనేట్ భేటీ కాగా, 53-46 ఓట్ల తేడాతో సీమా కార్మిక శాఖ కొత్త సొలిసిటర్గా ఎన్నికయ్యారు. కాగా, ఒబామా-బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఇంతకుముందు సీమా నంద చీఫ్ ఆఫ్ స్టాఫ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, కార్మిక శాఖ డిప్యూటీ సొలిసిటర్గా పని చేశారు.
అలాగే ఆమెకు లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అటార్నీగా 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఎక్కువగా ప్రభుత్వ శాఖలలో సీమా వేర్వేరు విధులు నిర్వహించారు. ఇక ఒబామా-బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఆమె డెమొక్రటిక్ జాతీయ కమిటీకి సీఈఓగా పని చేశారు. కనెక్టికట్లో పెరిగిన సీమా.. బ్రౌన్ యూనివర్సిటీ అండ్ బోస్టన్ కాలేజీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.