సరిహద్దుల్లో చైనా సైన్యం పెరగడం ఆందోళనకరం : ఆర్మీ చీఫ్
ABN , First Publish Date - 2021-10-02T22:42:25+05:30 IST
సరిహద్దుల్లో చైనా దళాలు పెరుగుతుండటం ఆందోళనకరమని ఇండియన్
లేహ్ : సరిహద్దుల్లో చైనా దళాలు పెరుగుతుండటం ఆందోళనకరమని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే చెప్పారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్-చైనా మధ్య పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు లడఖ్లో పర్యటించేందుకు వచ్చిన నరవనే ఓ వార్తా సంస్థతో శనివారం మాట్లాడారు.
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దళాలకు దీటుగా భారత దేశం కూడా దళాలను, ఇతర మౌలిక సదుపాయాలను మోహరించిందని జనరల్ నరవనే చెప్పారు. మరోసారి దూకుడుగా ఎవరూ ప్రవర్తించే అవకాశం లేదన్నారు. ఘర్షణ ప్రాంతాల వద్ద పరిస్థితి ఆరు నెలల నుంచి సాధారణంగా ఉందన్నారు. చర్చలు కొనసాగుతున్నాయన్నారు. 12వ విడత చర్చలు గత నెలలో జరిగాయని చెప్పారు. బహుశా అక్టోబరు రెండో వారంలో 13వ విడత చర్చలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
చర్చల ప్రారంభంలో కొందరు సందేహాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. చర్చల వల్ల పరిష్కారం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారన్నారు. చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవచ్చుననేది తన గట్టి అభిప్రాయమని తెలిపారు. కొద్ది నెలలుగా అదే జరుగుతోందన్నారు.