సంజీత్‌కు స్వర్ణం

ABN , First Publish Date - 2021-06-01T10:12:54+05:30 IST

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్‌ సంజీత్‌ అదరగొట్టాడు. హెవీవెయిట్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.

సంజీత్‌కు స్వర్ణం

అమిత్‌, థాపాకు రజతాలు

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

దుబాయ్‌: ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్‌ సంజీత్‌ అదరగొట్టాడు. హెవీవెయిట్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. కాగా, డిఫెండింగ్‌ చాంప్‌ అమిత్‌ పంగల్‌, శివ థాపా రజతాలతో సరిపెట్టుకొన్నారు. సోమవారం జరిగిన పురుషుల 91 కిలోల విభాగం ఫైనల్లో సంజీత్‌ 4-1తో ఒలింపిక్‌ పతక విజేత వాసిలి లెవిట్‌ (కజకిస్థాన్‌)ను చిత్తు చేశాడు. కాగా, 52 కిలోల కేటగిరి ఫైనల్లో అమిత్‌ పంగల్‌ 2-3తో వరల్డ్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ జోయ్‌రోవ్‌ షాకోబిడెన్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. బౌట్‌ ఆసాంతం ప్రత్యర్థిపై పంగల్‌ ఆధిపత్యమే కనిపించినా.. జడ్జీలు మాత్రం జోయ్‌రోవ్‌వైపు మొగ్గు చూపారు. టోక్యో ఒలింపిక్స్‌ ముందు జోయ్‌రోవ్‌ చేతిలో ఓడడం అమిత్‌కు ఇది మూడోసారి. కాగా, రెండో రౌండ్‌పై భారత్‌ రివ్యూ కోరినా.. జ్యూరీ అనుమతించలేదు. 


థాపాకు ఐదో పతకం..: 

64 కిలోల కేటగిరీలో హోరాహోరీగా సాగిన పోరులో శివ థాపా 2-3తో బటార్‌సుఖ చిన్‌జోరిగ్‌ (మంగోలియా) చేతిలో ఓడి రజతం అందుకున్నాడు. ఆసియా చాంపియన్‌షి్‌పలో థాపాకే ఇది ఐదో పతకం. మిగతా భారత బాక్సర్లలో వికాస్‌ క్రిషన్‌ (69 కిలోలు), వరీందర్‌ సింగ్‌ (60 కిలోలు) సెమీ్‌సలో ఓడి కాంస్యాలు దక్కించుకొన్నారు. ఈసారి టోర్నీలో భారత్‌ గతంలో కంటే అత్యధికంగా 2 స్వర్ణ, 5 రజత, 8 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించింది. మహిళల విభాగంలో పూజా రాణి పసిడి సాధించగా.. మేరీ సహా మరో ఇద్దరికి రజతాలు, ఆరుగురికి కాంస్యాలు లభించాయి. 2019లో భారత్‌ (2 స్వర్ణ, 4 రజత, 7 కాంస్య) మొత్తం 13 పతకాలు సాధించింది. 

Updated Date - 2021-06-01T10:12:54+05:30 IST