చేయని నేరానికి.. ఏడాదికిపైగా ఖతార్‌ జైలులో ఉన్న భారత జంట.. చివరికి

ABN , First Publish Date - 2021-04-17T17:30:07+05:30 IST

ఖతార్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై 2019లో ముంబైకు చెందిన దంపతులు మహమ్మద్ షరిఖ్, ఒనిబా ఖురేషి అరెస్ట్ అయ్యారు.

చేయని నేరానికి.. ఏడాదికిపైగా ఖతార్‌ జైలులో ఉన్న భారత జంట.. చివరికి

ముంబై: ఖతార్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై 2019లో ముంబైకు చెందిన దంపతులు మహమ్మద్ షరిఖ్, ఒనిబా ఖురేషి అరెస్ట్ అయ్యారు. అక్కడి న్యాయస్థానం ఈ జంటను దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో 21 నెలలు జైలులో ఉన్నారు. ఈ క్రమంలో షరిఖ్ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. భారత ప్రభుత్వాధికారులు ఖతార్ అధికారులతో ఈ దంపతుల విషయంలో అసలేం జరిగిందో వివరించారు. దాంతో ఎట్టకేలకు షరిఖ్, ఒనిబా నిర్దోషులుగా బయటపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ దంపతులు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2019, జూలై 4న ఖతార్ వెళ్లేందుకు షరిఖ్ దంపతులు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి దోహా వెళ్లాలనుకున్నారు. 


ఈ క్రమంలో వారికి తబస్సుం ఖురేషి అనే బంధువు ఓ బ్యాగు తీసుకొచ్చి ఇచ్చింది. దోహాలో మీరు బస చేసే హోటల్‌కు ఓ వ్యక్తి వచ్చి ఆ బ్యాగు తీసుకెళ్తాడని తబస్సుం చెప్పింది. ఆ సమయంలో అందులో ఏముందో కూడా షరిఖ్ దంపతులు ఆమెను అడగలేదు. అదే వారు చేసిన తప్పు. జూలై 6న దోహాలోని హమద్ విమానాశ్రయానికి చేరుకుందీ జంట. ఎయిర్‌పోర్టులో లగేజీ తనిఖీ చేయగా షరిఖ్ దంపతుల బ్యాగులో 4.1 కిలోల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. అంతే.. వారికి గుండె ఆగినంత పనైంది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఈ దంపతులను ఖతారీ డ్రగ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు ఆ బ్యాగు ఎవరిది? మీకు ఎవరిచ్చారు ? ఆ సరకు ఎవరికి ఇవ్వాలి? వారి కాంటాక్ట్స్ ఇవ్వాలంటూ ప్రశ్నలతో ముప్పతిప్పలు పెట్టారు. ఆ సమయంలో వారు చెప్పింది ఒక్కటే సమాధానం. ఆ బ్యాగు తమకు ఇచ్చింది తమ బంధువు తబస్సుం ఖురేషి అని. దాంతో డ్రగ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ అనంతరం షరిఖ్ దంపతులను దోహా సెంట్రల్ జైలుకు తరలించారు. 


ఐదు నెలల తర్వాత ఈ జంటను దోషిగా తేల్చిన న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఈ దంపతులకు ఏం చేయాలో అర్థంకాలేదు. తమకు తెలియకుండా బంధువు చేసిన నేరానికి తాము శిక్ష అనుభవించడం ఏంటని కుమిలిపోయారు. ఆ సమయంలో ఒనిబా గర్భణి. ఈ క్రమంలో షరిఖ్ కుటుంబ సభ్యులతో సాయంతో తమకు న్యాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అధికారుల విచారణలో షరిఖ్ అత్త తబస్సుం ఖురేషి మాదకద్రవ్యాలను ఈ జంట బ్యాగులో వారికి తెలియకుండా పెట్టినట్లు తెలిసింది. అంతేగాక ఈ షరిఖ్ దంపతుల ఖతార్ యాత్రను కూడా తబస్సుం స్పాన్సర్ చేసినట్లు అధికారులు తేల్చారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారుల అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడి న్యాయస్థానం ఈ దంపతుల అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది. 


విచారణ అనంతరం షరిఖ్ దంపతులను నిర్ధోషులుగా తేల్చిన కోర్టు.. మార్చి 29న వీరిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రం ఈ దంపతులు స్వదేశానికి పయనమయ్యారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సినిమా స్టోరీని తలపించే షరిఖ్ దంపతుల ఈ కథ చివరికి సుఖాంతమైంది.  

Updated Date - 2021-04-17T17:30:07+05:30 IST