వీబీఏం ఐదో దశ: సౌదీ నుంచి మరిన్ని విమాన సర్వీసులు
ABN , First Publish Date - 2020-08-14T16:13:24+05:30 IST
'వందే భారత్ మిషన్'(వీబీఏం) ఐదో దశలో భాగంగా సౌదీ అరేబియా నుంచి భారతదేశానికి మరిన్ని విమాన సర్వీసులు నడపనున్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.
జెడ్డా: 'వందే భారత్ మిషన్'(వీబీఏం) ఐదో దశలో భాగంగా సౌదీ అరేబియా నుంచి భారతదేశానికి మరిన్ని విమాన సర్వీసులు నడపనున్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. దమ్మం, రియాద్ నుంచి ఈ విమాన సర్వీసులు భారత్లోని వివిధ గమ్యస్థానాలకు రానున్నాయి. సౌదీలోని భారత ఎంబసీ ప్రకటించిన వివరాల ప్రకారం...
ఆగస్టు 16న మొదటి ఎయిరిండియా విమానం దమ్మం నుంచి కొచ్చికి రానుంది. మళ్లీ ఆగస్టు 17-21 మధ్య దమ్మం నుంచి తిరువనంతపురం, ముంబై, కొచ్చి, కన్నూర్కు విమాన సర్వీసులు రానున్నాయి. అలాగే రియాద్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 21-24 మధ్య హైదరాబాద్, ముంబై, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరుకు విమానాలు వస్తాయని ఎంబసీ అధికారులు తెలిపారు. ఆగస్టు 24న దమ్మం నుంచి చెన్నైకి ఇండిగో విమానం రానుంది. కాగా, మే మొదటి వారంలో ప్రారంభమైన 'వందే భారత్ మిషన్' ఇప్పటికే నాలుగు దశలు పూర్తి చేసుకుని... ఆగస్టు 1న ఐదో దశలోకి ప్రవేశించింది. ఈ మిషన్ ద్వారా ఇప్పటివరకు 10 లక్షల మంది ప్రవాసులు స్వదేశానికి తిరిగొచ్చినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.