గర్ల్ఫ్రెండ్ విషయంలో ఘర్షణ.. భారత టెకీని కాల్చి చంపిన అమెరికన్ !
ABN , First Publish Date - 2021-04-05T00:16:56+05:30 IST
అమెరికాలోని మిస్సౌరీలో భారత టెకీ దారుణ హత్యకు గురయ్యాడు.
మిస్సౌరీ: అమెరికాలోని మిస్సౌరీలో భారత టెకీ దారుణ హత్యకు గురయ్యాడు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని 32 ఏళ్ల షరీఫ్ రెహమన్ ఖాన్గా సెయింట్ లూయిస్ పోలీసులు గుర్తించారు. షరీఫ్ది మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్. కాగా, షరీఫ్ను గత బుధవారం సెయింట్ లూయిస్లోని యూనివర్శిటీ సిటీ అపార్ట్మెంట్లో బుల్లెట్ గాయాలతో ఉండడం చూసిన స్థానికులు 911 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు గాయాలతో ఉన్న షరీఫ్ను చికిత్స కోసం హూటాహూటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షరీఫ్ మృతిచెందాడు.
అయితే, అంతకుముందే షరీఫ్ వద్ద పోలీసులు కొంత సమాచారం రాబట్టారు. ఆ సమయంలో షరీఫ్ తనను కాల్చింది స్థానికంగా ఉండే 23 ఏళ్ల కోల్ జే మిల్లర్గా చెప్పాడు. దాంతో పోలీసులు మిల్లర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో షరీఫ్ స్నేహితురాలితో మిల్లర్కు శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. బుధవారం కూడా ఈ ఇద్దరు ఆ యువతి ఉండే యూనివర్శిటీ సిటీ అపార్ట్మెంట్కు వెళ్లినప్పుడు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే షరీఫ్పై మిల్లర్ కాల్పులు జరిపి యువతితో పాటు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. షరీఫ్ మృతితో అతని స్వస్థలం భోపాల్లోని సుభాష్ నగర్లో విషాదం నెలకొంది.