అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్లో భారతీయుడికి జాక్పాట్ !
ABN , First Publish Date - 2020-09-04T01:03:06+05:30 IST
అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్లో భారతీయుడికి జాక్పాట్ తగిలింది.
షార్జా: అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్లో భారతీయుడికి జాక్పాట్ తగిలింది. గురువారం నిర్వహించిన రాఫెల్ డ్రాలో మనోడు ఏకంగా 10 మిలియన్ దిర్హామ్స్(సుమారు రూ.17కోట్లు) గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... షార్జాలో ఉండే గురుప్రీత్ సింగ్ ఆగస్టు 12న కొనుగోలు చేసిన టికెట్ నెం. 067757కు ఈ జాక్పాట్ తగిలింది. ఈసారి కరోనా నేపథ్యంలో రాఫెల్ డ్రాను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. అలాగే రాఫెల్ డ్రా టైమింగ్ కూడా గురుప్రీత్కు తెలియదు. దీంతో మొదట రాఫెల్ నిర్వాహకుల నుంచి లాటరీ గెలుచుకున్నట్లు ఫోన్ వస్తే ఫ్రాంక్ కాల్ అనుకున్నాడట. పైగా ఆ సమయంలో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు. చివరకు మీడియా రిపోర్టు చెక్ చేసుకోవడం ద్వారా తాను నిజంగానే రూ.17 కోట్ల లాటరీ గెలుచుకున్నట్లు నిర్దారించుకుని ఆశ్చర్యపోవడం తన వంతైందని గురుప్రీత్ చెప్పాడు. గత రెండేళ్ల నుంచి తాను బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు.
ఇక పంజాబ్కు చెందిన ఈ సింగ్ కుటుంబం గత 32 ఏళ్లుగా యూఏఈలోనే ఉంటోంది. గురుప్రీత్కు మూడేళ్లు ఉన్నప్పుడు వారి ఫ్యామిలీ యూఏఈకి వలస వచ్చిందట. ప్రస్తుతం షార్జాలో నివసిస్తున్న గురుప్రీత్ దుబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన అతని తల్లిదండ్రులు ప్రస్తుతం పంజాబ్లోఉంటున్నారు. వారిని ఎప్పటికైనా తన వద్దకు తెచ్చుకోవాలనేది గురుప్రీత్ కల. ఇప్పుడు షార్జాలో ఉంటున్న సింగిల్ బెడ్రూం ఇంట్లో తమతో పాటు తల్లిదండ్రులు ఉండేందుకు ఇబ్బంది పడ్డారని, అందుకే వారు స్వదేశానికి వెళ్లిపోవడం జరిగిందని గురుప్రీత్ తెలిపాడు. తాజాగా తాను గెలుచుకున్న రూ. 17కోట్లలో కొంత మొత్తం వెచ్చించి సొంత ఇంటిని కొనుగోలు చేస్తానని, అప్పుడు పెరేంట్స్ను కూడా తనతో పాటే ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లకు తన కల నెరవేరబోతుందని గురుప్రీత్ ఆనందం వ్యక్తం చేశాడు.