స్వదేశానికి బయల్దేరిన భారత వ్యక్తి.. విమానాశ్రయంలోనే కన్నుమూత
ABN , First Publish Date - 2020-07-02T16:49:27+05:30 IST
పదో తరగతిలో ఉత్తీర్ణుడైన కుమారుడిని స్వయంగా కలిసి కంగ్రాట్స్ చెప్పాలని ఎంతో ఆశగా స్వదేశానికి రావాలనుకుని విమానాశ్రయానికి వచ్చిన భారత వ్యక్తి అక్కడే కన్నుమూసిన విషాద ఘటన రాస్ అల్ఖైమా విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది.
దుబాయి: పదో తరగతిలో ఉత్తీర్ణుడైన కుమారుడిని స్వయంగా కలిసి కంగ్రాట్స్ చెప్పాలని ఎంతో ఆశగా స్వదేశానికి రావాలనుకుని విమానాశ్రయానికి వచ్చిన భారత వ్యక్తి అక్కడే కన్నుమూసిన విషాద ఘటన రాస్ అల్ఖైమా విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కేరళ రాష్ట్రం కోజికోడ్కు చెందిన పవిత్రన్ మంచక్కల్(50) గత కొన్నేళ్లుగా రాస్ అల్ ఖైమాలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన కేరళ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచక్కల్ కుమారుడు ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ఎంతో సంతోష పడిన మంచక్కల్ స్వయంగా ఇండియాకు వచ్చి కుమారుడిని శుభాకాంక్షలు చెప్పాలని రాస్ అల్ఖైమా విమానాశ్రయానికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నాడు. రాత్రి 11.30 గంటలకు చార్టెడ్ విమానం భారత్కు బయల్దేరాల్సి ఉంది. అయితే, మహమ్మారి కరోనా సంక్షోభం నేపథ్యంలో మూడు నెలల క్రితం అతను ఉపాధి కోల్పోయాడు. దాంతో కుమారుడికి గిఫ్ట్గా కనీసం చేతి గడియారం కూడా కొనలేక పోయానని ఎయిర్పోర్టుకు బయల్దేరే ముందు అతను తోటి వారి దగ్గర బాధపడ్డాడు.
ఆ బాధతోనే ఎయిరోపోర్టుకు బయల్దేరిన మంచక్కల్ ఇంకొన్ని గంటల్లో స్వదేశానికి రావాల్సి ఉండగా ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. విమానాశ్రయంలోనే అతను కన్నుమూశాడు. అతని విమాన టికెట్ ఖర్చులు కూడా రాస్ అల్ఖైమాలోని చేతన అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిందని సభ్యుడు షాజీ కాయకోడి తెలిపారు. కాగా, మంచక్కల్ కుటుంబాన్ని ఆదుకునేందుకు రాస్ అల్ఖైమాకు చెందిన వీపీఎస్ హెల్త్కేర్ గ్రూపు ముందుకు వచ్చింది. ఈ సంస్థ చైర్మన్ షంషీర్ వయాలిల్ మాట్లాడుతూ మంచక్కల్ కుమారుడి ఉన్నత చదువులకై ఖర్చులను తామే భరిస్తామని చెప్పారు. తక్షణ సాయం కింద వీపీఎస్ సంస్థ రూ. 5లక్షలు మంచక్కల్ కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేసింది. మృతుడు మంచక్కల్కు భార్య సుమిత్రా, ఇద్దరు కుమార్తెలు ధనుషా, ధమన్య, కుమారుడు ధనూప్ ఉన్నారు.