బ్రిటన్ పార్లమెంట్‌లో రైతుల నిరసనలపై చర్చ.. ఖండించిన భారత్ హై కమిషన్

ABN , First Publish Date - 2021-03-09T17:05:34+05:30 IST

బ్రిటన్ పార్లమెంట్‌లో రైతు చట్టాలపై చర్చ జరగడాన్ని అక్కడి భారత్ కమిషన్ తప్పుపట్టింది. వాస్తవాలు తెలియకుండా చర్చలు

బ్రిటన్ పార్లమెంట్‌లో రైతుల నిరసనలపై చర్చ.. ఖండించిన భారత్ హై కమిషన్

లండన్: బ్రిటన్ పార్లమెంట్‌లో రైతు చట్టాలపై చర్చ జరగడాన్ని అక్కడి భారత్ కమిషన్ తప్పుపట్టింది. వాస్తవాలు తెలియకుండా చర్చలు చేపట్టడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చలు సమతుల్యంగా జరగాలని, వాస్తవాలు తెలియకుండా ఎటువంటి వాదనలకు దిగకూడదని చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని భారత్ హైకమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్‌లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 


రైతుల నిరసనలపై సోమవారం ఏకంగా బ్రిటన్ పార్లమెంట్‌లోనే చర్చ జరిగింది. రైతుల భద్రత, ప్రెస్ స్వేచ్ఛపై సుమారు 90 నిమిషాల పాటు చర్చలు జరిపారు. రైతుల నిరసనల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్స్, స్కాటిష్ నేషనల్ పార్టీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. త్వ‌ర‌లోనే ప్ర‌ధాని మోదీతో బ్రిటన్ ప్ర‌ధాని ఈ అంశంపై చర్చిస్తారని, ఆ స‌మ‌యంలో రైతు నిర‌స‌న‌ల అంశాన్ని లేవ‌నెత్తుతామ‌ని బ్రిట‌న్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. రైతు సంస్కరణలు భారత ప్రభుత్వ నిర్ణయమని యూకే ప్రభుత్వం ఇప్పటికే చెప్పడంతో దాని గురించి తాము చర్చించడం లేదని స్కాటిష్ నేష‌న‌ల్ పార్టీకి చెందిన మార్టిన్ డే అన్నారు. తాము కేవలం నిర‌స‌న‌కారుల భద్రత, ప్రెస్ స్వేచ్ఛ గురించి మాత్ర‌మే చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. నిర‌స‌న‌కారుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించార‌ని, ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయ‌న్నారు. మరోపక్క ఇదే చర్చలో కొంతమంది ఎంపీలు భారత ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు.

Updated Date - 2021-03-09T17:05:34+05:30 IST