హెచ్-1బీ వీసాపై ముగిసిన నిషేధం.. భారతీయులకు భారీ ఊరట !

ABN , First Publish Date - 2021-04-01T18:29:04+05:30 IST

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ సహా ఇతర నాన్-ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాలపై విధించిన నిషేధం గడువు బుధవారం అర్ధరాత్రితో(మార్చి 31) ముగిసింది.

హెచ్-1బీ వీసాపై ముగిసిన నిషేధం.. భారతీయులకు భారీ ఊరట !

వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ సహా ఇతర నాన్-ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాలపై విధించిన నిషేధం గడువు బుధవారం అర్ధరాత్రితో(మార్చి 31) ముగిసింది. ఇక ఈ నిషేధాన్ని ఎట్టిపరిస్థితిలో పొడిగించబోమని ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లబ్ధి చేకూరనుంది. కాగా, దేశవ్యాప్త లాక్​డౌన్​, కరోనా సంక్షోభం కారణంగా అమెరికన్లకు భారీగా నష్టం వాటిల్లుతుందని మాజీ అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బీతో పాటు ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసాలపై 2020 జూన్​లో నిషేధం విధించారు. మొదట 2020 డిసెంబర్​ 31వరకు ఈ నిషేధ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించారు. అనంతరం డిసెంబర్ 31న మరోసారి ఈ ఆంక్షలను 2021 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 


మహమ్మారి ప్రభావం దేశ ప్రజలపై ఇంకా కొనసాగుతున్నందున వర్క్ వీసాలపై మళ్లీ నిషేధాన్ని పొడిగించక తప్పలేదని అప్పుడు ట్రంప్ సర్కార్ పేర్కొంది. అయితే, బైడెన్​ కొత్త ప్రభుత్వం​ తాజాగా ఈ ఆంక్షల పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ట్రంప్ విధించిన ఆ గడువు నిన్నటితో ముగిసిపోయింది. ఇక ట్రంప్​ ఇమ్మిగ్రేషన్​ విధానాలు కఠినమైనవని, హెచ్​-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేస్తామని ఇదివరకే బైడెన్ సర్కార్ హామీ ఇచ్చింది. ఇది వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు కలిగించే విషయం. కాగా, హెచ్-1బీ వీసా అనేది అమెరికన్ కంపెనీలకు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ప్రధానంగా యూఎస్ ఐటీ సంస్థలు ప్రతియేటా హెచ్-1బీ వీసా ద్వారా భారత్, చైనా నుంచి వేలాది మందిని ఐటీ నిపుణులను నియమించుకుంటున్నాయి.


తాజాగా ట్రంప్ వర్క్ వీసాలపై విధించిన నిషేధం గడువు ముగిసిపోవడం, బైడెన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అమెరికన్ సంస్థలకు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు మార్గం సుగమమైంది. అటు అగ్రరాజ్యంలో కొలువు చేయాలనుకునే విదేశీ నిపుణులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇదిలాఉంటే.. 2022 ఏడాదికి గాను హెచ్-1బీ వీసాలకు సంబంధించి ప్రాథమిక దరఖాస్తుల స్వీకరణ పూర్తైందని, ఏప్రిల్ 1 నుంచి అర్హులైన వారు పిటిషన్ దాఖలు చేసుకోవాలని తాజాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. ఇక ప్రతి ఏడాది అగ్రరాజ్యం 85వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీటిలో చైనా తర్వాత అత్యధిక వీసాలు పొందేది మనోళ్లే.      

Updated Date - 2021-04-01T18:29:04+05:30 IST