బ్రిటన్లో భారత సంతతి వ్యక్తిపై హత్య కేసు !
ABN , First Publish Date - 2020-11-28T01:27:33+05:30 IST
బ్రిటన్లో 31 ఏళ్ల భారత సంతతి వ్యక్తిపై హత్య కేసు నమోదైంది.
లండన్: బ్రిటన్లో 31 ఏళ్ల భారత సంతతి వ్యక్తిపై హత్య కేసు నమోదైంది. దీంతో శుక్రవారం సదరు వ్యక్తిని పోలీసులు లండన్లోని వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వివరాల్లోకి వెళ్తే... వెస్ట్ లండన్లోని గ్రీన్ఫోర్డ్ పరిధిలోగల డ్రూ గార్డెన్స్లో నివాసముండే షానిల్ పటేల్ ఇంట్లో బుధవారం అతని తల్లి హన్సా పటేల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దీంతో షానిల్ ఇంటికి చేరుకున్న పోలీసులు హన్సా మృతదేహాన్ని పరిశీలించగా... ఆమె తలపై గాయాలు ఉండడం గమనించారు. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో తల్లి, కుమారుడు ఇద్దరే ఉన్నారు. దాంతో షానిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అతనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. శుక్రవారం లండన్లోని వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.