షార్జాలో భవనంపై నుంచి పడి.. భారత యువకుడి దుర్మరణం!
ABN , First Publish Date - 2021-06-18T14:28:31+05:30 IST
షార్జాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి చనిపోయాడు.
షార్జా: షార్జాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి చనిపోయాడు. అదే భవనంలో ఉండే కొందరితో గొడవ పడ్డ యువకుడు వారి నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు షార్జా పోలీసులు తెలిపారు. మృతుడిని టీవీ విష్ణు(29)గా గుర్తించారు. షార్జాలోని అబుసగ్రాలో ఈ ఘటన జరిగింది. విష్ణు నివాసముండే భవనంలోనే కొందరు ఆఫ్రికన్లు ఉన్నారు. విష్ణుతో వారు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఆఫ్రికన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన విష్ణు కాలు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ విష్ణు అక్కడికక్కడే చనిపోయాడు. మెదడులో ఇంటర్నల్ బ్లీడిండ్ కావడంతోనే విష్ణు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన షార్జా పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, అబుసగ్రాలో విష్ణు ఓ సెలూన్లో పని చేస్తున్నట్లు తెలిసింది.