ఒమన్ గల్ప్లో చిక్కుకున్న కార్గో షిప్కు ఇండియన్ నేవీ సహాయం
ABN , First Publish Date - 2021-03-13T00:36:28+05:30 IST
ఎలాంటి పరిస్థితుల్లోనైనా సకాలంలో, సరైన రీతిలో స్పందించే సత్తా
న్యూఢిల్లీ : ఎలాంటి పరిస్థితుల్లోనైనా సకాలంలో, సరైన రీతిలో స్పందించే సత్తా తనకు ఉందని భారత నావికా దళం మరోసారి నిరూపించుకుంది. ఒమన్ గల్ఫ్లో చిక్కుకున్న సరుకు రవాణా నౌకకు కోరిన వెంటనే సహాయపడి, పరిస్థితిని చక్కదిద్దింది. భారత నావికా దళం అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు.
భారత నావికా దళం వెల్లడించిన వివరాల ప్రకారం, ఐఎన్ఎస్ తల్వార్ను ఒమన్ గల్ఫ్లో మోహరించారు. ఒమన్ నుంచి ఇరాక్ వెళ్తున్న సరుకు రవాణా నౌక ఎంవీ నయన్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో మార్చి 9 నుంచి జలాల్లో చిక్కుకుంది. ఈ నౌకలోని ప్రొపల్షన్, పవర్ జనరేషన్ సిస్టమ్, నేవిగేషనల్ సిస్టమ్స్ విఫలమయ్యాయి. దీనిలో ఏడుగురు భారతీయ సిబ్బంది ఉన్నారు. వీరు భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ తల్వార్ నౌకకు సమాచారం అందించి, తమకు సహాయపడాలని కోరారు.
ఎంవీ నయన్ను ప్రాథమికంగా పరిశీలించిన మీదట భారత నావికా దళం వీబీఎస్ఎస్ (విజిట్ బోర్డ్, సెర్చ్, సీజర్) బృందాన్ని, ఓ సాంకేతిక బృందాన్ని ఓ పడవ ద్వారా పంపించింది. ఏడు గంటల పాటు శ్రమించి ఎంవీ నయన్లోని జనరేటర్లు, స్టీరింగ్ పంపు, సీవాటర్ పంప్, కంప్రెసర్, మెయిన్ ఇంజిన్ వంటివాటిని మరమ్మతు చేశారు. అదేవిధంగా జీపీఎస్, నేవిగేషన్ లైట్స్ వంటి నేవిగేషన్ ఎక్విప్మెంట్ను కూడా మరమ్మతు చేశారు.