న్యూయార్క్లో భారత సంతతి ట్రైన్ డ్రైవర్ చాకచక్యంతో.. తప్పిన పెను ముప్పు!
ABN , First Publish Date - 2021-05-27T19:45:27+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్నిరోజులుగా ఆసియన్ అమెరికన్లపై దాడులు జరుగుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్నిరోజులుగా ఆసియన్ అమెరికన్లపై దాడులు జరుగుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో తాజాగా న్యూయార్క్లో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు అమెరికన్లు ఓ ఆసియన్ వ్యక్తిని తీవ్రంగా కొట్టి స్థానికంగా ఉండే రైల్వే ట్రాక్పై పడేసి వెళ్లారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత అదే ట్రాక్పై ఓ రైలు వస్తోంది. కానీ, తీవ్రంగా గాయపడిన వ్యక్తి ట్రాక్పై నుంచి లేవలేని పరిస్థితి. ఇది గమనించిన సబ్వే ఆపరేటర్ వెంటనే ఆ ట్రైన్ డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. ఆ ట్రైన్ డ్రైవ్ చేస్తుంది తొబిన్ మొదాతిల్(29) అనే భారత సంతతి వ్యక్తి. సబ్వే ఆపరేటర్ సూచన మేరకు వెంటనే అప్రమత్తమైన తొబిన్ చాకచక్యంగా వ్యవహరించారు. ట్రాక్పై ఉన్న వ్యక్తి గాయాలతో ఉండడం గమనించిన తొబిన్ 30 అడుగుల దూరంలోనే ట్రైన్ను నిలిపివేయడంతో పెను ముప్పు తప్పింది. ఇక రైలు ఆగిపోయిన తర్వాత అక్కడ ఉన్నవారిలో కొందరు ట్రాక్పై గాయాలతో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం సమీపంలోని మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం. కాగా, చాకచక్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన తొబిన్పై అక్కడి మీడియా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. భారత సంతతి డ్రైవర్ను సూపర్ హీరో అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.