సింగపూర్లో భారత సంతతి మహిళా పోలీసుకు జైలు !
ABN , First Publish Date - 2020-07-07T18:43:48+05:30 IST
సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన మహిళా పోలీసుకు సింగపూర్ న్యాయస్థానం సోమవారం ఏడు నెలల జైలు శిక్ష విధించింది.
సింగపూర్ సిటీ: సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన మహిళా పోలీసుకు సింగపూర్ న్యాయస్థానం సోమవారం ఏడు నెలల జైలు శిక్ష విధించింది. పోలీస్ డిపార్ట్మెంట్ జారీ చేసిన రెండు ఐప్యాడ్లను దుర్వినియోగం చేసి షాపులో కుదువ పెట్టినందుకు గాను హేమవతి గుణశేఖరన్(37)కు కోర్టు ఈ శిక్ష వేసింది. ఈ రెండు ఐప్యాడ్ల విలువ 900 సింగపూర్ డాలర్లు(రూ. 48,352) ఉంటుందని... హేమవతి వాటిని 300 సింగపూర్ డారల్లకు(రూ.16,092) కుదువ పెట్టినట్లు కోర్టు విచారణలో తేలింది. అలా కుదవ పెట్టిన ఐప్యాడ్లను ఆమె రీడీమ్ చేయకపోవడంతో షాపు వారు వేరే వ్యక్తులకు విక్రయించారు. పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఐప్యాడ్లను తోటి ఉద్యోగిని హేమవతికి హ్యాండ్ ఓవర్ చేయగా ఆమె ఇలా దుర్వినియోగానికి పాల్పడింది. కాగా, 2005లో సింగపూర్ పోలీస్ ఫోర్స్లో చేరిన హేమవతికి, ఇప్పుడు ఈ కేసులో ఏడు నెలలు కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.