భారత సంతతి నేతృత్వంలోని పరిశోధన బృందానికి.. రూ.73లక్షల ప్రైజ్
ABN , First Publish Date - 2020-09-28T13:31:18+05:30 IST
లాలాజలాన్ని పరీక్షించి వ్యాధులు, పౌష్టికాహార లోపాలను గుర్తించగల ఫోన్ ఆధారిత నిర్ధారణా పద్ధతిని అమెరికాలోని
- భారత సంతతి శాస్త్రవేత్త సౌరభ్ మెహతా ఘనత
వాషింగ్టన్, సెప్టెంబరు 27: లాలాజలాన్ని పరీక్షించి వ్యాధులు, పౌష్టికాహార లోపాలను గుర్తించగల ఫోన్ ఆధారిత నిర్ధారణా పద్ధతిని అమెరికాలోని కార్నెల్ వర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త సౌరభ్ మెహతా నేతృత్వంలోని పరిశోధక బృందం అభివృద్ధిచేసింది. ఈ ఆవిష్కరణకు విశేష గుర్తింపు లభించింది. దీన్ని రూ.73 లక్షల విలువైన ‘టెక్నాలజీ యాక్సిలరేటర్ చాలెంజ్ ప్రైజ్’కు ఎంపిక చేసినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, లేబొరేటరీలు అందుబాటులో లేని చోట కూడా.. లాలాజల నమూనాలోని బయో మార్కర్ల ఆధారంగా మలేరియా, ఐరన్ లోపాలను గుర్తించడం ఈ పరీక్ష ప్రత్యేకత అని మెహతా వెల్లడించారు. 15 నిమిషాల్లోనే ఫలితాన్ని ఇవ్వగల ఈ పరీక్ష కోసం మొబైల్ ఫోన్కు 3డీ ప్రింటెడ్ అడాప్టర్ను అమర్చి, ఒక మొబైల్ యాప్తో అనుసంధానిస్తారు. ఈ యాప్.. లాలాజలాన్ని స్కాన్ చేసి మలేరియా, ఐరన్ లోపాలను గుర్తిస్తుంది.