భారతీయుడిని పొడిచి చంపిన తోటి వ్యక్తి.. కువైట్లో..
ABN , First Publish Date - 2021-04-13T13:48:53+05:30 IST
కువైట్లో దారుణం జరిగింది. ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది.
కువైట్ సిటీ: కువైట్లో దారుణం జరిగింది. ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. ఈ గొడవలో ఓ భారతీయుడు కోపోద్రిక్తుడై మరో భారత వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు. కువైట్ గవర్నరేట్ పరిధిలోని అల్ అహ్మదీలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, వీరిద్దరూ దేనికోసం ఘర్షణ పడ్డారనే విషయం మాత్రం తెలియరాలేదు. అలాగే మృతుడి వివరాలు గానీ, నిందితుడి వివరాలను గానీ పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అల్ అహ్మదీలో 24 గంటల వ్యవధిలో ఇదే తరహాలో జరిగిన రెండో ఘటనగా పోలీసులు పేర్కొన్నారు. అంతకుముందు కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తి కువైట్ పౌరుడిని హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు.