భారత విద్యార్థులకు బ్రిటన్ గుడ్న్యూస్!
ABN , First Publish Date - 2021-08-12T21:34:51+05:30 IST
భారత విద్యార్థులకు బ్రిటన్ గుడ్న్యూస్ చెప్పింది. తమ విద్యాసంస్థల్లో చదవడానికి వచ్చే ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్యను ప్రతి యేటా పెంచుతున్న యూకే.. 2021 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో పెంచింది.
లండన్: భారత విద్యార్థులకు బ్రిటన్ గుడ్న్యూస్ చెప్పింది. తమ విద్యాసంస్థల్లో చదవడానికి వచ్చే ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్యను ప్రతి యేటా పెంచుతున్న యూకే.. 2021 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో పెంచింది. ఈసారి బ్రిటన్లోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఏకంగా 3,200 మందికి ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 19 శాతం అధికం. యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అడ్మిషన్స్ సర్వీస్(యూసీఏఎస్) మంగళవారం ఈ విషయాన్ని తెలియజేసింది. ఇదిలాఉంటే.. కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఉన్న ఆంక్షల నుంచి కూడా భారత్కు ఇటీవల యూకే మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్ను రెడ్లిస్ట్ నుంచి అంబర్ జాబితాకు మార్చింది.
దీంతో భారత విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఇంతకుముందు యూకేకు వెళ్లేవారు పది రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సి వచ్చేది. దీనికయ్యే ఖర్చు విద్యార్థులే భరించాల్సి ఉండేది. కానీ, తాజా సడలింపుల కారణంగా ఇకపై విద్యార్థులు యూనివర్శటీ హాస్టళ్లు లేదా తాము ఎంపిక చేసుకున్న చోట క్వారంటైన్లో ఉండే వీలు ఏర్పడింది. మరోవైపు ఈ ఏడాది జూలైలో బ్రిటన్ విదేశీ విద్యార్థుల కోసం అమల్లోకి తెచ్చిన పోస్ట్ స్టడీ వీసా కూడా మన విద్యార్థులకు బాగా ఉపయోగపడనుంది. ఎందుకంటే చదువు పూర్తయ్యాక కూడా విద్యార్థులు రెండేళ్ల పాటు ఆ దేశంలో ఉండేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది. బ్రిటన్ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు భారత విద్యార్థులకు బాగా మేలు చేస్తాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.