లండన్ యూనివర్శిటీలకు పోటెత్తిన భారతీయ విద్యార్థులు !

ABN , First Publish Date - 2021-03-20T14:55:08+05:30 IST

బ్రిటన్ రాజధాని లండన్‌లోని విశ్వవిద్యాలయాలకు 2019-20 ఏడాదికి గాను భారతీయ విద్యార్థులు పోటెత్తారు.

లండన్ యూనివర్శిటీలకు పోటెత్తిన భారతీయ విద్యార్థులు !

లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లోని విశ్వవిద్యాలయాలకు 2019-20 ఏడాదికి గాను భారతీయ విద్యార్థులు పోటెత్తారు. 2018-19 విద్యా సంవత్సరం కంటే అనూహ్యమైన పెరుగుదల నమోదైంది. దీంతో 2018-19లో అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న భారత్.. 2019-20లో రెండో స్థానానికి ఎగబాకింది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ (హెచ్ఈఎస్ఏ) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం గతేడాది లండన్ యూనివర్శిటీల్లో ఏకంగా 13,435 మంది భారతీయ విద్యార్థులు చేరారు. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 7,185గా ఉంది. అంటే 2018-19 కంటే 2019-20లో 87 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2017-18తో పోలిస్తే ఇది 152 శాతం పెరిగినట్లు ఈ డేటా బెబుతోంది.


ఇక 29,940 మంది విద్యార్థులతో 2019-20 విద్యా సంవత్సరంలో డ్రాగన్ కంట్రీ చైనా మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే.. అమెరికా 7,245 మంది విద్యార్థులతో మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం యూకే వ్యాప్తంగా వివిధ యూనివర్శిటీల్లో 55,465 మంది భారత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కాగా, అంతర్జాతీయ విద్యార్థుల కోసం బ్రిటన్ ప్రభుత్వం రెండేళ్ల పోస్ట్-స్టడీ వీసాను తిరిగి ప్రవేశపెట్టడం కూడా భారతీయ విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ గ్రాడ్యుయేట్లకు వారి కోర్సులు పూర్తైన తర్వాత ఉపాధి కోసం ఎక్కువ సమయం అక్కడ ఉండటానికి ఈ పోస్ట్-స్టడీ వీసా వీలు కల్పిస్తుంది.  

Updated Date - 2021-03-20T14:55:08+05:30 IST