భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌‌కు మళ్లీ కరోనా కాటు!

ABN , First Publish Date - 2021-07-13T21:40:18+05:30 IST

భారతదేశపు తొలి కరోనా పేషెంట్‌గా రికార్డులకెక్కిన కేరళ యువతి తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు.

భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌‌కు మళ్లీ కరోనా కాటు!

త్రిస్సూర్: భారతదేశపు తొలి కరోనా పేషెంట్‌గా రికార్డులకెక్కిన కేరళ యువతి తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు. త్రిస్సూర్ వాస్తవ్యురాలైన ఆమె చైనాలో వైద్య విద్య అభ్యసిస్తూ కరోనా సంక్షోభం కారణంగా గతేడాది జనవరిలో స్నేహితులతో పాటూ భారత్‌కు తిరిగొచ్చారు. ఈ కమ్రంలో ఆమె దేశంలో అడుగు పెట్టాక పాజిటివ్ అని తేలింది. అయితే.. ఆ యువతి తాజాగా మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారులు ఇటీవల వెల్లడించారు. ఆమెలో కరోనా రోగలక్షణాలేవీ లేవని కూడా వారు తెలిపారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్న సదరు విద్యార్థిని ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆమె కరోనా టీకా తొలి డోసు కూడా తీసుకుందని వారు పేర్కొన్నారు. 


కాగా.. తొలిసారి కరోనా బారిన పడ్డ సందర్భంలో ఆమె నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో గడపాల్సి వచ్చింది. ఆమెతో పాటూ వూహాన్ నుంచి తిరిగొచ్చిన మరో ఇద్దరు స్నేహితులు కూడా కొంతకాలం తరువాత కరోనా కాటుకు గురైయ్యారు. ఇక భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) గతంలో జరిపిన అధ్యయనంలో రీఇన్ఫెక్షన్ రేటు(మరోమారు కరోనా బారినపడటం) 4.5 శాతంగా తేలింది. గతేడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఐసీఎమ్ఆర్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 

Updated Date - 2021-07-13T21:40:18+05:30 IST