యూఏఈ వెళ్లాలనుకునే వారికి ఎయిర్ ఇండియా షాక్!
ABN , First Publish Date - 2021-06-24T16:50:09+05:30 IST
యూఏఈ వెళ్లాలనుకునే వారికి ఎయిర్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఈ నెల 24 నుంచి యూఏఈకి విమానాలు నడుపుతామని ప్రకటించిన ఎయిరిండియా తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది.
దుబాయ్: యూఏఈ వెళ్లాలనుకునే వారికి ఎయిర్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఈ నెల 24 నుంచి యూఏఈకి విమానాలు నడుపుతామని ప్రకటించిన ఎయిరిండియా తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. జూలై 6 నుంచి యూఏఈకి తిరిగి తమ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించింది. గతంలో భారత విమానాలను జూలై 6 నుంచి మాత్రమే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని యూఏఈ ప్రకటించడంతో దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. ఇదిలాఉంటే.. జూన్ 23 నుంచి వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రయాణికులను తమ దేశానికి వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు యూఏఈ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే దుబాయ్ విమానాశ్రయం టర్మినల్-1ను సుమారు 15 నెలల తర్వాత పున:ప్రారంభిస్తున్నట్లు కూడా తెలియజేసింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఎయిర్ ఇండియా ఈ నెల 24 నుంచి యూఏఈకి విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. దాంతో యూఏఈ వెళ్లాలనుకునే భారత ప్రవాసులు టికెట్లు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతుండగా ఇప్పుడు ఎయిరిండియా చేసిన ప్రకటనతో వారిని అయోమయంలో పడేసింది. దీనిపై స్పందించిన దుబాయ్లోని భారత కాన్సులేట్ ఈ విషయమై ఇరు దేశాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇచ్చింది.