‘ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’

ABN , First Publish Date - 2021-06-18T22:03:15+05:30 IST

మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని

‘ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’

  • కేసీఆర్, హరీశ్ రావులే ఇందుకు బాధ్యత వహించాలి
  • బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి
  • మల్లన్నసాగర్ నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించాలి
  • ఇందిరా శోభన్ డిమాండ్

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైఎస్ షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆరోపించారు. ఇవాళ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసిన ఇందిర.. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో సిద్ధిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్‌కు చెందిన వృద్ధుడు తుటుకూరి మల్లారెడ్డి మనోవేదనతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టాడన్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇంట్లోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య పేరు మీద ఇల్లు ఉందని.. ఆమె ఇటీవల మరణించడంతో మల్లారెడ్డికి ఇల్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడాన్ని ఇందిరాశోభన్ తప్పుబట్టారు. భార్య మృతి చెందితే భర్తకు ఇల్లు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని ఆమె ప్రశ్నించారు.


అండగా ఉంటాం.. పోరాడుతాం!

కన్నతల్లి లాంటి ఊరును వదిలి వెళ్తున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని వసతులు సమకూర్చాల్సిన ప్రభుత్వం.. నిర్వాసితుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడమేంటి..?. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులే ఇందుకు బాధ్యత వహించాలి. మల్లన్న సాగర్ కింద భూ సేకరణ జరిగిన అన్ని గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందలేదని ఆందోళనలు జరుగుతున్న విషయం ప్రభుత్వం తెలుసుకోవాలి. ఫాంహౌస్ కోసం, కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేశారు. మల్లారెడ్డి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలి. నిర్వాసితులకు తమ పార్టీ నాయకురాలు షర్మిలక్క అండగా ఉంటారు. నిర్వాసితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తారు అని ఇందిరా శోభన్ తెలిపారు.



Updated Date - 2021-06-18T22:03:15+05:30 IST