మునిగిపోయిన సబ్‌మెరైన్.. 53 మంది జలసమాధి!

ABN , First Publish Date - 2021-04-25T01:50:44+05:30 IST

బుధవారం నాడు యుద్ధ విన్యాసాల సందర్భంగా ఆచూకీ తెలీకుండా పోయిన ఇండోనేషియా జలాంతర్గామి సముద్రంలో మునిగిపోయిందని అక్కడి మిలిటరీ తాజాగా ప్రకటించింది.

మునిగిపోయిన సబ్‌మెరైన్.. 53 మంది జలసమాధి!

బాలి: బుధవారం నాడు యుద్ధ విన్యాసాల సందర్భంగా ఆచూకీ తెలీకుండా పోయిన ఇండోనేషియా జలాంతర్గామి సముద్రంలో మునిగిపోయిందని అక్కడి మిలిటరీ తాజాగా ప్రకటించింది. సబ్‌మెరైన్‌లోని 53 మంది సిబ్బంది జలసమాధి అయినట్టు తెలిపింది. దీంతో.. దేశం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. బుధవారం నాడు యుద్ధ నేవీ డ్రిల్స్ జరుగుతున్న సందర్భంగా జలాంతార్గామి అకస్మాత్తుగా కనబడకుండా పోయింది. దీంతో..నావికా దళం పెద్ద ఎత్తున గాలింపు చర్యలకు దిగింది. ఈ చర్యల్లో అమెరికాతో సహా వివిధ దేశాలు పాలుపంచుకున్నాయి. కాగా.. సబ్‌మెరైన్ చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో ఇంధనం లీకైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో సబ్‌మెరైన్ భారీ ప్రమాదంలో పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటువంటి సందర్భాల్లో నీటి అడుగుకి చేరిన సబ్‌మెరైన్‌లో మూడు రోజులకు సరిపడా అత్యవసర ఆక్సిజన్ నిల్వలు ఉంటాయి. శనివారం నాటికి ఈ గడువు ముగిసింది. 


కాగా.. టార్పిడో(సబ్‌మెరైన్‌లోని ఆయుధం)కు సంబంధించిన కొన్ని భాగాలను  వెలికితీశామని, జలాంతర్గామికి భారీ నష్టం జరగనిదే ఇవి లభ్యమయ్యే అవకాశమే లేదని అధికారులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక జలాంతర్గామిలోని ఇంధన ట్యాంకు దెబ్బతినడంతో సబ్‌మెరైన్ ముందుకు కదలలేక సుముద్రంలో 700 మీటర్ల కంటే దిగువకు జారిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ లోతుల్లో ఉండే నీటి ఒత్తిడి కారణంగా సబ్‌మెరైన్ ప్లాస్టిక్ సీసా లాగా నలిగిపోయి..అందులోని వారు మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. 

Updated Date - 2021-04-25T01:50:44+05:30 IST