సింధు, ప్రణీత్‌కు షాక్‌

ABN , First Publish Date - 2021-01-13T10:21:23+05:30 IST

సుదీర్ఘ విరామం అనంతరం కోర్టులోకి అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది.

సింధు, ప్రణీత్‌కు షాక్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఆరంభ రౌండ్లోనే ఓటమి


బ్యాంకాక్‌: సుదీర్ఘ విరామం అనంతరం కోర్టులోకి అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. పదినెలల తర్వాత థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-1000తో తొలి అంతర్జాతీయ టోర్నీలో పోటీపడ్డ ప్రపంచ చాంపియన్‌ సింధుకు అనూహ్యంగా తొలిరౌండ్లోనే షాక్‌ తగిలింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆరోసీడ్‌ సింధుకు డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిచెల్ట్‌ చెక్‌ పెట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో సింధు 21-16, 24-26, 13-21తో ప్రపంచ 18వ ర్యాంకర్‌ బ్లిచెల్ట్‌ చేతిలో పరాజయంపాలైంది. 74 నిమిషాల పాటు సాగిన పోరులో తొలిగేమ్‌ అలవోకగా నెగ్గిన సింధు... తర్వాతి రెండు గేముల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపో యింది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్‌ ఆటగాడు సాయి ప్రణీత్‌కు కూడా చుక్కెదురైంది. ఆరంభరౌండ్లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ సాయి ప్రణీత్‌ 16-21, 10-21తో స్థానిక షట్లర్‌ కంటాఫాన్‌ వాంగ్‌చెరోన్‌ చేతిలో కంగుతిని టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల డబుల్స్‌లో భారత జోడీ సిక్కిరెడ్డి-అశ్విని 16-21, 7-21తో కొరియాకు చెందిన నాలుగోసీడ్‌ కిమ్‌ సో యోంగ్‌-కాంగ్‌ హీ యోంగ్‌ చేతిలో ఓటమి పాలైంది. అయితే, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని జంట 21-11, 27-29, 21-16తో ఇండోనేసియా ద్వయం హఫీజ్‌-గ్లోరియాపై గెలిచి శుభారంభం చేసింది.

Updated Date - 2021-01-13T10:21:23+05:30 IST