పారిశ్రామికవేత్త కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-10-26T13:48:11+05:30 IST
బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వేత్తను చెన్నైలో ఉన్న స్థలం కోసం, రూ.10 కోట్ల నగదు కోసం కిడ్నాప్ చేసి స్టార్హోటల్లో నెలరోజులపాటు నిర్బంధించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన
చెన్నై(Tamilnadu): బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వేత్తను చెన్నైలో ఉన్న స్థలం కోసం, రూ.10 కోట్ల నగదు కోసం కిడ్నాప్ చేసి స్టార్హోటల్లో నెలరోజులపాటు నిర్బంధించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త తులసీవంశీకృష్ణకు ఆదంబాక్కం తిరువళ్లువర్ నగర్లో 40 వేల చదరపుటడుగుల స్థలం ఉంది. ఆ స్థలాన్ని విక్రయించేందుకు ఆయన తరచూ చెన్నైకి వచ్చివెళుతుం డేవారు. ఆ సందర్భంగా ప్రైవేటు సంస్థకు చెందిన బాలమురుగన్ అలియాస్ బాలాజీ, ప్రభాకర్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ స్థలాన్ని కొంటామని తులసీవంశీకృష్ణకు తెలిపారు. ఆ మేరకు ఆయన ఇరువురిని కలిసినప్పుడు వారు పదిమంది దుండగుల సాయంతో కిడ్నాప్ చేసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి ఆ స్థలాన్ని తమ పేరుకు రాయించుకుని విడిచిపెట్టారు. కొద్దిరోజులయ్యాక మళ్ళీ తులసీవంశీకృష్ణను ఆ ఇరువురు కలిసి ఆ స్థలానికి చెందిన మూల పత్రాన్ని రద్దు చేయాలని పట్టుబట్టారు. దీనికి నిరాకరించడంతో ఆయనను దుండగులు చెన్నైలోని స్టార్ హోటల్లో నెల రోజులపాటు బంధించారు. ఆ స్థలం మూలపత్రాన్ని తమ పేరుకు మార్చాలని, రూ.10 కోట్ల నగదును చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. చివరకు తులసీవంశీకృష్ణ తల్లి చెన్నై పోలీసులకు కుమారుడి కిడ్నాప్ గురించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్టార్ హోటల్లో నిర్బంధించిన తులసీవంశీకృష్ణను విడిపించారు. ఈ సంఘటనకు సంబంధించి సాలిగ్రామానికి చెందిన బాలాజీ, ఆళ్వార్తిరుగనగరికి చెందిన సురేశ్, పళ్లికరణైకి చెందిన సెల్వ నేషన్ అలియాస్ స్పీడ్ సెల్వా, కోడంబాక్కానికి చెందిన జాన్సన్, మదురైకి చెందిన తిరుమురుగన్ను అరెస్టు చేశారు.