ఏదో చేద్దామనుకుని.. పాపం ఇన్ఫోసిస్.. ఇలా బుక్కైందేంటి!

ABN , First Publish Date - 2021-09-30T19:40:01+05:30 IST

ఇన్ఫోసిస్.. ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. అయితే ఈ సంస్థకు సంబంధించిన ఓ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగుల్లో మార్పు తేవడం కోసం చేసిన చిరు ప్రయత్నం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయం కోర్టు దాకా వెళ్లడంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే

ఏదో చేద్దామనుకుని.. పాపం ఇన్ఫోసిస్.. ఇలా బుక్కైందేంటి!

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్.. ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. అయితే ఈ సంస్థకు సంబంధించిన ఓ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగుల్లో మార్పు తేవడం కోసం చేసిన చిరు ప్రయత్నం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయం కోర్టు దాకా వెళ్లడంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ సంస్థకు కోర్టు.. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు స్థానిక మున్సిపల్ అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకున్నారు. అసలేం జరిగింది..? ఇన్ఫోసిస్ చేసిన చిరు ప్రయత్నమేంటి..? ఏదో చేద్దామనుకున్న ఈ సంస్థకు ఎదురైన చిక్కేంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.


కీలక నిర్ణయం ఇదీ..

భారతదేశ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఇన్ఫోసిస్ కూడా ఒకటి. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో బ్రాంచీలు ఉన్నాయి. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన పోచారంలో కూడా ఈ సంస్థకు ఓ బ్రాంచ్ ఉంది. అయితే ఈ బ్రాంచికి సంబంధించిన ఇన్ఫోసిస్ ప్రతినిధులు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం బ్రాంచ్‌లో పని చేసే ఉద్యోగుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. కారుకు రూ.500, బైక్‌లు, స్కూటర్‌లకు రూ. 250-300 పార్కింగ్ ఫీజును వసూలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో చేసేదేమీ లేక అందులో పని చేసే ఉద్యోగులందరూ ఆ మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చారు. అయితే ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి.. విజయ్ గోపాల్ అనే సామాజిక కార్యకర్త చెవిన పడింది. ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు‌ను ఆశ్రయించారు.



కోర్టుకు వివరణ ఇలా..

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన కోర్టు ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో సదరు ప్రతినిధులు స్పందిస్తూ.. తమ సంస్థ ఉద్యోగుల్లో మార్పు తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత వాహనాల నుంచి పబ్లిక్ వాహనాలవైపు తమ సంస్థ ఉద్యోగులను మళ్లించాలనే ఉద్దేశంతోనే ఇలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. వ్యక్తిగత వాహనాల వల్ల.. కాలుష్యం పెరగడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం ద్వారా సంస్థ ఉద్యోగులు.. పబ్లిక్ వాహనాలను ఆశ్రయిస్తారని భావించినట్లు వివరించారు.


మరోవైపు మున్సిపాలిటీ కూడా..

ఇదిలా ఉంటే.. ఇన్ఫోసిస్ అనుసరిస్తున్న విధానంపై స్థానిక మున్సిపాలిటీ అధికారులు కూడా కొరడా ఝులిపించారు. తెలంగాణ స్టేట్‌ అపార్ట్‌మెంట్‌ యాక్ట్‌-1987, తెలంగాణ స్టేట్‌ మున్సిపాలిటీ యాక్ట్‌-2019ల ప్రకారం ఉద్యోగుల నుంచి సంస్థ పార్కింగ్ ఫీజును వసూలు చేయడం తప్పు. దీంతో పోచారం మున్సిపాలిటీ అధికారులు ఇన్ఫోసిస్‌కి రూ.50,000 జరిమానా విధించారు. మొత్తానికి చూస్తే.. ఏదో చేద్దామనుకుని ఇన్ఫోసిస్ ఇలా బుక్కయిపోయింది.


Updated Date - 2021-09-30T19:40:01+05:30 IST