వృద్ధురాలి మృతదేహాన్ని తెచ్చి.. శ్మశానంలో అనాథగా వదిలేసి..
ABN , First Publish Date - 2021-04-21T09:50:21+05:30 IST
అర్ధరాత్రి వృద్ధురాలి మృతదేహాన్ని కొందరు శ్మశాన వాటికకు తెచ్చారు. ఓ గద్దె మీద ఉంచి..
నిజామాబాద్లో సంబంధీకుల అమానవీయం
పెద్దబజార్, ఏప్రిల్ 20 (నిజామాబాద్): అర్ధరాత్రి వృద్ధురాలి మృతదేహాన్ని కొందరు శ్మశాన వాటికకు తెచ్చారు. ఓ గద్దె మీద ఉంచి.. కట్టెలు తెస్తామని అక్కడి వాచ్మన్కు చెప్పి వెళ్లిపోయారు. వెళ్లినవారు మళ్లీ రాలేదు. గంటలు గడిచాయి.. తెల్లవారిపోయినా వారు రాలేదు. ఆ మృతదేహం ఎవరిదో.. వదిలేసిన వారెవరో తెలియదు గానీ.. అనుబంధాలను, మానవసంబంధాలను ప్రశ్నించేలా ఉన్న ఈ ఘటన నిజామాబాద్లో స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని ప్రగతినగర్ శ్మశానవాటిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్మశానవాటిక వాచ్మన్ మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు, స్థానికులు చొరవచూపి వృద్ధురాలి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతురాలు ఎవరు? మృతదేహాన్ని వదిలేసి వెళ్లినవారెవరు? అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.