బాబు, భువనేశ్వరి కోసం వర్ల దంపతుల దీక్ష

ABN , First Publish Date - 2021-11-25T01:44:57+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసన ఎదురైంది.

బాబు, భువనేశ్వరి కోసం వర్ల దంపతుల దీక్ష

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసన ఎదురైంది. చంద్రబాబుకు మద్దతుగా అనేక మంది నిలిచారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరును ముక్తకంఠంతో నిందించారు. ఈ నేపథ్యంలోనే భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 12 గంటల నిరసన దీక్షకు వర్ల టీడీపీ నేత వర్ల రామయ్య దంపతులు సిద్ధమయ్యారు. చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం  ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు వర్ల దంపతుల దీక్ష చేయనున్నారు. 


నిత్యం నిబ్బరంగా, నిగ్రహంగా... సందర్భాన్ని బట్టి ఆగ్రహంగా మాత్రమే కనిపించే చంద్రబాబు తొలిసారిగా కన్నీరు పెట్టారు. మనసులోని బాధతో మాట్లాడలేకపోయారు. భావోద్వేగం భరించలేక వెక్కివెక్కి ఏడ్చారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మీడియా ముందు మాట్లాడుతూనే.. కన్నీరు పెట్టారు. సుమారు రెండు నిమిషాలపాటు ఆయన తేరుకోలేకపోయారు. అంతకుముందు పార్టీ శాసనసభ పక్షం కార్యాలయంలోనూ తీవ్ర వేదనతో కంటతడిపెట్టారు.


చంద్రబాబు కంటతడిపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలను చెప్పులతో కొట్టి, తగులబెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో  కె.నాగేశ్వరరావు అనే కార్యకర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-11-25T01:44:57+05:30 IST