క్వారంటైన్‌ కేంద్రంలో సౌకర్యాలపై ఆరా

ABN , First Publish Date - 2021-05-17T04:45:39+05:30 IST

మండల పరిధిలోని గోపవరం గ్రామ సమీపంలోగల పశువైద్య కళాశాల క్వారంటన్‌ సెంటర్‌ను ఆదివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ సందర్శించి అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు.

క్వారంటైన్‌ కేంద్రంలో సౌకర్యాలపై ఆరా
ప్రొద్దుటూరు క్వారంటైన్‌ సెంటర్‌లో అధికారులతో మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌

ప్రొద్దుటూరు రూరల్‌, మే 16: మండల పరిధిలోని గోపవరం గ్రామ సమీపంలోగల పశువైద్య కళాశాల క్వారంటన్‌ సెంటర్‌ను ఆదివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ సందర్శించి అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. కరోనా పేషంట్లకు క్వారంటైన్‌ సెంటర్‌లో ఏయే రకాల సౌకర్యాలు అందుతున్నాయని, వసతి, మందులు తదితర వాటిపై అధికారులతోపాటు కరోనా పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వచ్చి ఇంటిలో వసతి లేనివారికి కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారిని ఇక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ సౌకర్యాన్ని కరోనా బాధితులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్బన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరకుమార్‌, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి, అర్బన్‌ డీపీఎం విష్ణు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

కరోనా పట్ల  నిర్లక్ష్యం తగదు : డీఎస్పీ 

 

జమ్మలమడుగు రూరల్‌, మే 16:కరోనా వైరస్‌ పట్ల  ప్రజలు  నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ నాగరాజు సూచించారు. ఆదివారం జమ్మలమడుగు పట్టణంలో పలు వీధుల్లో ఆయన కర్ఫ్యూ అమలు ను స్వయంగా పరిశీలించారు.  తప్పనిసరి అయితే బయటికి రావాలని మాస్కులు ధరించి శానిటైజర్‌ ఉపయోగించాలన్నారు. ప్రతి ఒక్కరు కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలుకు సహకరించాలని ఆయన కోరారు. జమ్మలమడుగులో ఇటీవల రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-17T04:45:39+05:30 IST