పంచాయతీ సెక్రటరీలపై విచారణ

ABN , First Publish Date - 2020-05-19T11:21:24+05:30 IST

నిర్లక్ష్యపు విధులు, అవినీతి ఆరోపణలపై సస్పెండైన పంచాయతీ సెక్రటరీలు ఏ.ఆనందరావు, జి.చంద్రశేఖర్‌రెడ్డిలను సోమవారం జడ్పీ

పంచాయతీ సెక్రటరీలపై విచారణ

కడప (రూరల్‌), మే 18: నిర్లక్ష్యపు విధులు, అవినీతి ఆరోపణలపై సస్పెండైన పంచాయతీ సెక్రటరీలు ఏ.ఆనందరావు, జి.చంద్రశేఖర్‌రెడ్డిలను సోమవారం జడ్పీ సీఈవో సి.సుధాకర్‌రెడ్డి తన చాంబర్‌లో విచారించారు. పలు రికార్డులను పరిశీలించి, సంఘటనా వివరాల పట్ల ఆరాతీశారు. పూర్తి సమాచారం తెలియరాకపోవడంతో మరోసారి విచారణకు ఆదేశించారు. సంఘటన వివరాలు ఇలా... ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీకి గతంలో సెక్రటరీలుగా పనిచేసిన ఏ.ఆనందరావు, జి.చంద్రశేఖర్‌రెడ్డిలు పంచాయతీ రికార్డులను అందుబాటులో ఉంచని కారణంగా అవినీతి అక్రమాలు తెలియరాలేదు, వాటర్‌ టాక్స్‌ రశీదులు ప్రింట్‌వి కాకుండా టైప్‌ చేసినవి ఇచ్చారు.


దీనివలన జమా పద్దుల్లో లోటుపాట్లు జరిగినట్లు సందేహాలు కలగడంతో 2019 నవంబర్‌లో కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆదేశాల మేరకు అప్పటి విచారణాధికారిగా వ్యవహరించిన జడ్పీ సీఈవో శ్రీనివాసులరెడ్డి పై ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. ఇలాంటి క్రమంలో 2020 మే మొదటి వారంలో ఏ.ఆనందరావు తమకు పోస్టింగ్‌ ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయం నుంచి పూర్తి స్థాయిలో మరోసారి విచారణ జరిపించి తగు నివేదికను పంపాలని జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డికి ఆదేశాలు రావడంతో ఆయన సోమవారం పంచాయతీ సెక్రటరీలను విచారించారు.

Updated Date - 2020-05-19T11:21:24+05:30 IST