నెల్లిమర్ల పాఠశాల ఘటనపై విచారణ
ABN , First Publish Date - 2021-04-21T05:19:39+05:30 IST
నెల్లిమర్ల బాలికోన్నత పాఠశాలలో భవనం పై నుంచి పదో తరగతి బాలిక కింద పడి గాయపడిన సంఘటనపై విజయనగరం డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీ మంగళవారం విచారణ ప్రారంభించారు.
బాలిక భవనంపై నుంచి దూకేసినట్లు ప్రాథమిక అంచనా
నెల్లిమర్ల, ఏప్రిల్ 20: నెల్లిమర్ల బాలికోన్నత పాఠశాలలో భవనం పై నుంచి పదో తరగతి బాలిక కింద పడి గాయపడిన సంఘటనపై విజయనగరం డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీ మంగళవారం విచారణ ప్రారంభించారు. పాఠశాల హెచ్ఎం నారాయణరావు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. గాయపడిన బాలిక తండ్రితోనూ, ఆయనతో పాటు వచ్చిన టీడీపీ నాయకులు లెంక అప్పలనాయుడు, చందక పెంటంనాయుడులతో వేర్వేరుగా సమావేశమై వివరాలు రాబట్టారు. తమ కుమార్తెకు ఆరోగ్యపరంగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఆదుకోవాలని బాలిక తండ్రి కోరారు. సంఘటనకుగల కారణాలపై ఆరా తీయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ బాలిక రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడలేదని, ఉద్దేశపూర్వకంగా దూకేసి ఉంటుందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు భోగట్టా. బాధిత బాలిక సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి నేరుగా కింద పడడంతో వెన్నుపూస ఛిద్రమైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దాదాపు జీవితం అంతా ప్రభావం చూపే ఈ సంఘటనకు అసలు కారణాలు తెలుసుకునేందుకు అధికారులు లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.