స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల తనిఖీ
ABN , First Publish Date - 2021-03-02T06:09:09+05:30 IST
మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద హైవే 44పై నిర్మిస్తున్న భారీ స్టీల్ బ్రిడ్జి పనులను సోమవారం జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు మేనేజర్ తరుణ్ పరిశీలించారు.
పరిశీలించిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు మేనేజర్
తూప్రాన్(మనోహరాబాద్), మార్చి 1: మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద హైవే 44పై నిర్మిస్తున్న భారీ స్టీల్ బ్రిడ్జి పనులను సోమవారం జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు మేనేజర్ తరుణ్ పరిశీలించారు. మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణం కోసం హైవే 44 రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ఆర్వోబీ నిర్మాణం చేపట్టి రైల్వే లైన్ను ఏర్పాటు చేశారు. వర్షాలకు ఆర్వోబీలో భారీగా నీరు చేరి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నట్లు తరుణ్ తెలిపారు. రైల్వేశాఖ అనుమతులు లభిస్తే పనులు త్వరితగతిన పూర్తవుతాయని వివరించారు. దేశంలో ఇప్పటి వరకు స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలు నాలుగు లైన్ల రహదారులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం రామాయపల్లి వద్ద రూ. 109 కోట్ల నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జిని ఆరు లైన్లుగా నిర్మాణం చేస్తున్నారు. 45 మీటర్ల పొడవుతో 6 లైన్ల రోడ్డుగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేయబోతున్నారు. 45 మీటర్ల స్టీల్ బ్రిడ్జికి అనుబంధంగా ఇరువైపుల సైతం బ్రిడ్జిల నిర్మాణం చేయనున్నారు. రామాయపల్లి వద్ద నిర్మిస్తున్న ఆరు లైన్ల స్టీల్ బ్రిడ్జి దేశంలోనే మొదటిది కానున్నట్టు తెలిపారు.