జీజీహెచ్పై సీసీ నిఘా
ABN , First Publish Date - 2020-08-14T11:49:06+05:30 IST
నెల్లూరులోని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పరిస్థితులపై ఇప్పటివరకు అనేక ఆరోపణలు, అధికారులు, వైద్యులపై
కరోనా వార్డుల్లో కెమెరాల ఏర్పాటు
కరోనా బాధితుల పర్యవేక్షణకు తోడ్పాటు
అధికారులు, వైద్యుల్లో మరింత బాధ్యత పెంచేందుకు చర్యలు
నెల్లూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరులోని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పరిస్థితులపై ఇప్పటివరకు అనేక ఆరోపణలు, అధికారులు, వైద్యులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరైన వైద్యం అందించడం లేదని, సకాలంలో భోజనం చేరవేయడం లేదని ఇటీవల కరోనా బాధితులు నిరసనలు తెలిపారు. అదే సమయంలో ఓ బాధితుడు మరణించినా కొన్ని గంటల పాటు గుర్తించలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రిపై ప్రత్యక్ష పర్యవేక్షణకు జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిరంతరం బాధితుల ఆరోగ్య పరిస్థితిని, వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు జీజీహెచ్లోని కరోనా వార్డుల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల్లో మొత్తం 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఆసుపత్రిలోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించారు. ఈ సీసీ కెమెరాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జిల్లా ఎమర్జెన్సీ కంట్రోల్ రూంతోపాటు తన క్యాంపు కార్యాలయానికి కూడా జీజీహెచ్లోని సీసీ కెమెరాలను అనుసంధానం చేయించారు.
వీటిద్వారా కలెక్టర్తోపాటు ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆసుపత్రిలోనికి వెళ్లకుండానే అక్కడ పరిస్థితిని సమీక్షించవచ్చు. జీజీహెచ్లో కరోనా రోగులకు అందుతున్న వసతులు, సౌకర్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు బాధితుల ఆరోగ్య పరిస్థితి, భోజనం అందుతున్న తీరును కూడా పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి జీజీహెచ్ అధికారులతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిలో మరింత బాధ్యత ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తద్వారా చాలా వరకు సమస్యలు తొలగుతాయని అంచనా వస్తున్నారు. ఇక ఇప్పటికే కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ప్రతి రోజూ ఆసుపత్రిలోని కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. ఆరోగ్య వివరాలతోపాటు వైద్యం, భోజనం, ఇతర సౌకర్యాలు బాగున్నాయో లేదో తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు జీజీహెచ్ అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు.