క్యాష్లెస్ కాదంటే ఆసుపత్రిపై చర్యలు
ABN , First Publish Date - 2020-08-15T07:45:13+05:30 IST
నగదు రహిత ఆరోగ్య బీమాకు అంగీకరించని ఆసుపత్రులపై చర్యలు తీసుకొనే అధికారం బీమా కంపెనీలకు ఉందని బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) ప్రకటించింది...
- బీమా సంస్థలు వాటిని బ్లాక్లిస్టులో పెట్టొచ్చు
- బీమా నియంత్రణ సంస్థ సర్క్యులర్ జారీ
కోల్కతా, ఆగస్టు 14: నగదు రహిత ఆరోగ్య బీమాకు అంగీకరించని ఆసుపత్రులపై చర్యలు తీసుకొనే అధికారం బీమా కంపెనీలకు ఉందని బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) ప్రకటించింది. ఈ మేరకు గత నెలాఖరులో ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఆసుపత్రుల సేవా లోపాల విషయంలో చర్యలు తీసుకొనే బాధ్యత బీమా కంపెనీదేనని స్పష్టం చేసింది. కొవిడ్ పరిస్థితుల్లో నగదు రహిత బీమా సౌకర్యం ఉన్న రోగుల నుంచి కూడా ఆసుపత్రిలో చేర్చుకోవడానికి భారీ అడ్వాన్సులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అధికం కావడంతో ఐఆర్డీఏ ఈ సర్క్యులర్ జారీ చేసింది. నగదు రహిత బీమా సౌకర్యం అందించడానికి బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని, ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులను బ్లాక్ లిస్టులో పెట్టే అధికారం బీమా కంపెనీకి ఉందని ఐఆర్డీఏ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య తగ్గిపోయి పాలసీ హోల్టర్లకే నష్టం జరుగుతుందన్నారు. సదరు ఆసుపత్రి మీద బీమా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని సర్క్యులర్లో ఉం దని ప్రస్తావించారు. డిపాజిట్లు డిమాండ్ చేయడం, భారీగా బిల్లులు వేయడం వంటి సమస్యలను పరిష్కరించగల చట్టబద్ధ హోదా రాష్ట్రాలకే ఉందని బీమా సంస్థ అధికారి వ్యాఖ్యానించారు.
తాజాగా కోల్కతాలోని ఆసుపత్రుల సంఘం స మావేశమై నగదురహిత బీమా సౌకర్యం ఉన్న రోగుల నుం చి అడ్వాన్సులు వసూలు చేయరాదని నిర్ణయించింది. నగదు రహిత బీమా సౌకర్యం లేని వారి నుంచి రూ.50 వేలు అడ్వాన్సుగా స్వీకరిస్తామని ప్రకటించింది. కరోనా రోగికి జనరల్ వార్డులో రోజుకు రూ.15 వేలు, ఆక్సిజన్ వార్డులో రూ.20 వేలు, ఐసీయూలో రూ.25 వేలు, వెంటిలేటర్తో కలిపి రూ.35 వేలు వసూలు చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆసుపత్రుల సంఘాల సమా ఖ్య కోరుతోంది. పీపీఈ కిట్లు, గ్లవ్స్, ఇతర కొవిడ్ జాగ్రత్త సామగ్రికి బీమా సంస్థలు సొమ్ము ఇవ్వకపోవడంతో ఆసుపత్రులు నగదు రహిత బీమా ఉన్న వారి నుంచి కూడా అడ్వాన్సులు అడుగుతున్నాయని టీపీఏ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చిన కొవిడ్ బీమా చేయించుకున్న వారికి ఆ సమస్య ఉండదని చెప్పారు.