‘గంగ’లో దూకి ఇంటర్ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2021-10-25T04:26:09+05:30 IST
ఇంటర్ విద్యార్థి తెలుగు గంగ కాలువలో దూకి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని చెంబేడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగింది.
పెళ్లకూరు, అక్టోబరు 24 : ఇంటర్ విద్యార్థి తెలుగు గంగ కాలువలో దూకి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని చెంబేడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు చెంబేడు బీసీ కాలనీకి చెందిన పాలచ్చూరు సురేష్ - సుభాషిణి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు ఉదయ్కిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. రెండో కుమారుడు సునీల్ (16) శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గతనెలలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. శనివారం ఫలితాలు విడుదలయ్యాయి. తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెందాడు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులకు తెలియకుండా బయటకెళ్లాడు. రాత్రి 10 గంటలకు కూడా కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు బంధువులతో కలసి ఊరంతా గాలించినా కనిపించలేదు. ఆదివారం ఉదయం తెలుగుగంగ కాలువ బ్రిడ్జి వద్దకెళ్లే సరికి అక్కడ ఉన్న చెప్పులు, సెల్ఫోన్లను గమనించి చూడగా సునీల్ మృతదేహం గంగకాలు వలో ఉంది. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి ఇంటికి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.