Congress ‘వరి దీక్ష’లో ఆసక్తికర సన్నివేశం.. రేవంత్-కోమటిరెడ్డి కలిసిపోయారు..!

ABN , First Publish Date - 2021-11-27T20:26:43+05:30 IST

ఆ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. ఇద్దరూ ఎంపీలే, కీలక నేతలు కూడా.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఒక్కటంటే...

Congress ‘వరి దీక్ష’లో ఆసక్తికర సన్నివేశం.. రేవంత్-కోమటిరెడ్డి కలిసిపోయారు..!

హైదరాబాద్ సిటీ : ఆ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. ఇద్దరూ ఎంపీలే, కీలక నేతలు కూడా.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఒక్కటంటే ఒక్కటీ లేవు.. అంతేకాదు చివరికి ఒకే పదవి కోసం ఇద్దరూ శాయశక్తులా యత్నించారు. వారిలో ఒకరు సక్సెస్ కాగా.. ఇంకొకరు ఫెయిల్ అయ్యారు. అయితే అప్పట్లో ఫెయిల్ అయిన ఆయన ఇక కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేస్తారేమో అని అభిమానులు, అధిష్టానం కూడా అనుకున్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదండోయ్.. ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న వీరు ఇప్పుడు కలిసిపోయారు.. ఈ సన్నివేశం చూసిన జనాలు, కాంగ్రెస్ అధిష్టానం సైతం ఒకింత ఆశ్చర్యపోయింది. అసలు ఈ సందర్భమేంటి..? వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..


కాంగ్రెస్‌లో నూతనోత్సాహం..!

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ, రేపు ధర్నాచౌక్‌లో ‘వరి దీక్ష’ చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. అయితే.. ఈ దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ ఒకరంటే ఒకరికి పడని.. ఒక్కసారీ మాట్లాడుకోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు... కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది.


ఫలించిన వీహెచ్ మంత్రాంగం..

వాస్తవానికి టీపీసీసీ చీఫ్‌ కోసం విశ్వప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి.. ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎడమొహం.. పెడమొహంగా ఉన్న ఈ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఒకే తాటిపైకి తీసుకురావడానికి సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకట్రెండు సందర్భాల్లో వీహెచ్ ఫెయిల్ అయినప్పటికీ.. ఇవాళ వరి దీక్షతో కోమటిరెడ్డి-రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. దీంతో వీహెచ్ మంత్రాంగం ఫలించినట్లయ్యింది. అయితే ఇద్దరూ కలిసిపోయినట్టేనా..? లేకుంటే దీక్ష ముగిసే వరకు మాత్రమే ఇలా కలిసుంటారా..? అనేది ప్రశ్నార్థకమే.


ఇకపై ఇలాగే ఉంటారా..!?

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ నియామకం పట్ల అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి.. సందర్భం దొరికినప్పుడలా దానిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి రేవంత్‌తో కలిసి ఆయన వేదికను పంచుకోవడం.. ఇద్దరూ కలిసి అభివాదం చేయడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఇవాళ దీక్ష కాబట్టి ఇలా మాట్లాడుకున్నారు సరే..? మున్ముందు పార్టీ కార్యక్రమాల్లో ఇలాగే పాల్గొంటారో లేదో..? ఈ దీక్ష అయ్యాక ఎవరి దారిన వాళ్లుంటారా.. లేదా ఇలాగే కలిసుంటారా..? అనేది వేచి చూడాల్సిందే మరి.

Updated Date - 2021-11-27T20:26:43+05:30 IST