నేషనల్ హైవేలో డ్రెయినేజీ పనుల అడ్డగింత
ABN , First Publish Date - 2022-01-18T05:40:49+05:30 IST
వైరాలోని జాతీయ ప్రధాన రహదారికి రెండు వైపులా చేపట్టిన డ్రెయినేజీ పనులు గందరగోళంగా మారాయి.
మూడు శాఖల మధ్య కొరవడిన సమన్వయం
వైరా, జనవరి17: వైరాలోని జాతీయ ప్రధాన రహదారికి రెండు వైపులా చేపట్టిన డ్రెయినేజీ పనులు గందరగోళంగా మారాయి. ఏకంగా మిషన్ భగీరథ పైపులైన్ పైనే నిర్మించ తలబెట్టిన డ్రైనేజీ పనులను స్థానికులు అడ్డుకున్నారు. సోమవారం సాయంత్రం వైరాలో క్రాస్ రోడ్డు వద్ద డ్రెయినేజీ పనులను స్థానికులు అడ్డుకోని నిలిపివేశారు. ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, మున్సిపల్ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. దాదాపు 18 నెలలుగా ఈ డ్రైనేజీ నిర్మాణం ముందుకు సాగడం లేదు. కలెక్టర్ గౌతమ్ ఆదేశాలతో గత నెలలో ఆర్అండ్బీ స్థలాలలోని అక్రమణలను తొలగించారు. రెండున్నర కోట్లతో డ్రెయినేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఆర్అండ్బీ రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 50 అడుగుల తర్వాత మరో 5 అడుగుల వెడల్పుతో డ్రెయినేజీ నిర్మించాలని డిమాండ్ ఉంది. అయితే ఆర్అండ్బీ అధికారులు 45 అడుగుల తర్వాత మిగిలిన 5 అడుగుల వెడల్పుతో డ్రైనేజీ నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే ఈ డ్రైనేజీ నిర్మించే భూమిలో 6 అడుగుల లోతులో కొణిజర్ల మండలానికి వెళ్లే రెండు మిషన్ భగీరథ పైపు లైన్లు ఉన్నాయి. ఆ పైపు లైన్ల పైభాగంలో డ్రైన్లు నిర్మించేందుకు సిద్ధంగా కాగా మిసన్ భగీథ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఆర్అండ్బీ సిబ్బందితో వాదనకు దిగారు. రెండు శాఖల సిబ్బంది ఈ విషయాన్ని తమ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్కు కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. మంగళవారం ఉదయాన్నే మూడు శాఖల అధికారులు చేరుకోని సమస్యను పరిష్కారించాలని నిర్ణయించారు.