హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-06-20T17:45:18+05:30 IST

కడ్తాల ఎస్‌ఐ సుందరయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్ట్‌

  • కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో చోరీలు
  • కంబ్లి మల్లేశ్‌ పై హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో 16 కేసులు 
  • పీడీ యాక్డ్‌ కింద జైలుకు తరలింపు
  • ఎస్‌ఐ సుందరయ్య, పీసీలు యాదగిరి, 
  • రామకోటిలను అభినందించిన సీఐ ఉపేందర్‌

ఆమనగల్లు : అంతర్రాష్ట్ర ఘరాన దొంగపై ఆమనగల్లు పోలీసులు పీడీ యాక్డ్‌ నమోదు చేసి జైలుకు పంపించారు. 40 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్థుడిని ఆమనగల్లు పోలీసులు శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. కడ్తాల ఎస్‌ఐ సుందరయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌ కేసు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని దూల్‌పేటకు చెందిన కంబ్లి మల్లేశ్‌ కొన్ని సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ జేబు దొంగతనాలకు పాల్పడేవాడు. 


కర్ణాకట, మహారాష్ట్ర, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రద్దీగా ఉన్న సంతలు, మార్కెట్లు, ర్యాలీలు, సమావేశాలను టార్గెట్‌గా చేసుకొని మల్లేశ్‌ జేబు దొంగతనాలకు పాల్పడేది. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి. పలుసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అంతేకాకుండా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని టప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌లో కూడా మల్లేశ్‌పై కేసులు నమోదు కావడంతో పీడీ యాక్ట్‌ నమోదు చేసి సంవత్సరంపాటు జైలుకు పంపించారు. అయినప్పటికీ మల్లేశ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న కడ్తాల మండలం కర్కల్‌పహాడ్‌ వద్ద పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒకరి జేబులో నుంచి రూ.90 వేలు దొంగతనం చేశాడు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి మల్లేశ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. 


సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశానుసారం మల్లేశ్‌పై కడ్తాల పోలీసు స్టేషన్‌లో పీడీ యాక్డ్‌ నమోదు చేశారు. జైలు నుంచి విడుదలైన మల్లేశ్‌ పోలీసులకు దొరకకుండా బీదర్‌, బాంబేలో తిరుగుతుండగా కడ్తాల ఎస్‌ఐ సుందరయ్య నేతృత్వంలో పోలీసు సిబ్బంది యాదగిరి, రామకోటి, శాంసన్‌లు బృందంగా ఏర్పడి పట్టుకున్నారు. పీడీ యాక్డ్‌ కింద చర్లపల్లి జైలుకు తరలించినట్లు సీఐ ఉపేందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశ్‌ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ సుందరయ్య, పీసీలు యాదగిరి, రామకోటిలను సీఐ అభినందించి క్యా్‌ష్‌ రివార్డులను అందజేశారు.

Updated Date - 2021-06-20T17:45:18+05:30 IST