డిస్కౌంట్‌ బ్రోకర్ల వైపే మదుపర్ల మొగ్గు

ABN , First Publish Date - 2021-04-01T06:08:04+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ వైపు సాధారణ మదుపర్లు ఆకర్షితులవుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ట్రేడింగ్‌ ఖాతాలను ప్రారంభిస్తున్నారు. మార్చి 31తో ముగిసిన

డిస్కౌంట్‌ బ్రోకర్ల వైపే మదుపర్ల మొగ్గు

 కొత్త ట్రేడింగ్‌ ఖాతాల్లో 75ు వీరి వద్దే


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్టాక్‌ మార్కెట్‌ వైపు సాధారణ మదుపర్లు ఆకర్షితులవుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ట్రేడింగ్‌ ఖాతాలను ప్రారంభిస్తున్నారు. మార్చి 31తో ముగిసిన ఏడాదిలో 9 నెలల కాలంలో 52 లక్షల మంది ట్రేడింగ్‌ ఖాతాలు ప్రారంభించినట్టు అంచనా. గత నాలుగేళ్లలో కొత్తగా ప్రారంభమైన ఖాతాలకు ఇది సమానం. దీంతో మార్కెట్‌లో మొత్తం యాక్టివ్‌ మదుపర్లు 1.6 కోట్ల మందికి చేరారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


కొత్తగా ట్రేడింగ్‌ ఖాతాలు ప్రారంభిస్తున్న మదుపర్లలో అధిక భాగాన్ని డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ కంపెనీలే ఆకర్షించడం విశేషం. కొత్త ఖాతాలు ప్రారంభించిన వారిలో 75 శాతం మంది డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ కంపెనీలనే ఎంచుకున్నారు. దీంతో చురుగ్గా ట్రేడింగ్‌ చేసే మొత్తం మదుపర్లలో దాదాపు 45 శాతం మంది డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ కంపెనీల ద్వారానే చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన బ్రోకింగ్‌ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కొత్త రిటైల్‌ మదుపర్లలో అధిక శాతం మంది 20-30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారే ఉంటున్నారు. 


లావాదేవీల పరిమాణం : లావాదేవీల పరిమాణంలో బ్యాంకులకు చెందిన బ్రోకింగ్‌ కంపెనీలదే పై చేయి. బ్యాంకులకు చెందిన బ్రోకింగ్‌ సంస్థలు మదుపర్లకు సలహా, పరిశోధన నివేదికలను అందించడం, రిలేషన్‌షిప్‌ మేనేజర్లను ఏర్పాటు చేయడం వంటి సేవలను అందించడం ద్వారా అధిక మొత్తంలో మదుపర్లను ఆకర్షిస్తున్నాయి. బ్రోకింగ్‌ సేవల వల్ల లభించే ఆదాయం పరంగా మొత్తం ఆదాయంలో డిస్కౌంట్‌ బ్రోకరేజీ కంపెనీల ఆదాయం 25-30 శాతం ఉంటే.. బ్యాంకుల బ్రోకరేజీ సంస్థల వాటా 40 శాతం వరకూ ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 


Updated Date - 2021-04-01T06:08:04+05:30 IST