ఐఫోన్ 12 కొంటున్నారా? భారత్ కంటే దుబాయ్లో చాలా చౌక!
ABN , First Publish Date - 2020-10-21T10:06:51+05:30 IST
అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఈ మధ్యనే లాంచ్ చేసిన ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?
న్యూఢిల్లీ: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఈ మధ్యనే లాంచ్ చేసిన ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. దుబాయ్లో ఈ ఫోన్లు భారత్లో కంటే చాలా చౌకగా లభించనున్నాయి. రెండు దేశాల్లో వీటి ధరల మధ్య ఎంత తేడా అంటే.. భారత్లో ‘ఐఫోన్ 12 ప్రో’ ఆపై మోడళ్ల కోసం చెల్లించే రేటుతో మీరు సరదాగా దుబాయ్ వెళ్లి, అదే మోడల్ ఫోన్ను కొనుగోలు చేసి భారత్కు తిరిగి రావచ్చు. అంటే, షాపింగ్కు విహారం, వినోదం బోనస్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. లేదంటే, ఇది ఎంచుకోదగ్గ ప్రత్యామ్నాయమే.
కారణమేంటి?
భారత్లో అధిక పన్నులే ఇందుకు కారణం. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఫోన్లపై జీఎ్సటీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. దీనికితోడు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫోన్లపై 20 శాతం కనీస కస్టమ్స్ సుంకం (బీసీడీ)తో పాటు 2 శాతం సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే, విదేశీ ఫోన్లపై మొత్తంగా విధించే పన్ను 40 శాతం. ఈ కారణంగానే అమెరికా, దుబాయ్ కంటే భారత్లో వినియోగదారులు విదేశీ ప్రీమియం ఫోన్లకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని మార్కెట్ వర్గాలంటున్నాయి.