ఐపీఎల్-2021 వేదికలు ఖరారు.. 52 రోజులు 60 మ్యాచ్లు!
ABN , First Publish Date - 2021-03-06T22:49:01+05:30 IST
ఐపీఎల్ అభిమానులకు ఇది శుభవార్తే. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఐపీఎల్ను యూఏఈలో
న్యూఢిల్లీ: ఐపీఎల్ అభిమానులకు ఇది శుభవార్తే. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఈసారి మాత్రం స్వదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం దేశ్యాప్తంగా ఆరు వేదికలను ఎంపిక చేసింది. వచ్చే నెల 9న ఐపీఎల్ ప్రారంభం కానుండగా మే 30న ముగియనుంది. 52 రోజులపాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్కతా, ముంబైలలో బయోసెక్యూర్ వాతావరణంలో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ గత సీజన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. దుబాయ్,అబుదాబి, షార్జాలలో మ్యాచ్లు జరిగాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు దుబాయ్ ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన రోహిత్ శర్మ జట్టు ఐదోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుండడంతో ఈసారి ఐపీఎల్ను ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ వేదికలను ఎంపిక చేసింది. ఇప్పుడా వేదికల్లో బయో-బబుల్స్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జరగుతున్న దేశవాళీ పోటీలు కూడా బయో సెక్యూర్ వాతావరణంలో జరుగుతున్నాయి.