ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకున్న చైనీస్ మొబైల్ కంపెనీ వివో..!

ABN , First Publish Date - 2020-08-04T22:46:07+05:30 IST

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనీస్ మొబైల్ కంపెనీ వివోను కొనసాగించడంపై...

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకున్న చైనీస్ మొబైల్ కంపెనీ వివో..!

ముంబై: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనీస్ మొబైల్ కంపెనీ వివోను కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనీస్ మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు సమాచారం. అయితే.. కొద్దిరోజుల క్రితం భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే.


ఇప్పటికే టిక్‌టాక్‌తో సహా పలు చైనీస్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ స్పాన్సర్‌గా కొనసాగడం భావ్యం కాదని భావించిన వివో స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు తెలిసింది. అయితే.. ప్రస్తుతానికి ఈ సంవత్సరం వరకూ తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ లీగ్‌లో రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.


దేశమంతా చైనా కంపెనీలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా బీసీసీఐ మాత్రం వివోను కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇంత స్వల్ప కాలంలో మరో కంపెనీ దొరకడం సాధ్యం కాదని బోర్డు భావించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే ఐపీఎల్‌ను బహిష్కరించాలంటూ దేశ ప్రజలకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) పిలుపునిచ్చింది. దీంతో.. వివో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి ఎట్టకేలకు తప్పుకుంది. ఐపీఎల్ 2020కి త్వరలో కొత్త కంపెనీ స్పాన్సర్ చేయనుంది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరిగే ఈ లీగ్‌ కోసం ఆటగాళ్లంతా యూఏఈలో అడుగుపెట్టబోతున్నారు.

Updated Date - 2020-08-04T22:46:07+05:30 IST