హమ్మయ్య.. ఆసీస్ చేరారు
ABN , First Publish Date - 2021-05-18T06:05:17+05:30 IST
ఐపీఎల్ వాయిదా పడిన రెండు వారాల తర్వా త ఎట్టకేలకు స్వదేశానికి చేరిన ఆస్ర్టేలియా ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ సహా 38 మంది...
సిడ్నీ: ఐపీఎల్ వాయిదా పడిన రెండు వారాల తర్వా త ఎట్టకేలకు స్వదేశానికి చేరిన ఆస్ర్టేలియా ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ సహా 38 మంది ఆసీస్ క్రికెటర్ల బృందం మాల్దీవుల నుంచి సోమవారం సిడ్నీకి చేరుకుంది. బయో బబుల్లోనూ కరోనా కేసులు వెలుగు చూడడంతో ఈనెల 4న ఐపీఎల్ సీజన్ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్ నుంచి ఆస్ట్రేలియా దేశానికి విమాన రాకపోకలపై ఆంక్షలు ఉండడంతో వీరంతా మాల్దీవుల్లో సేద తీరారు. అక్కడి నుంచి కౌలాలంపూర్ ద్వారా సోమవారం ఉదయం సిడ్నీ విమానాశ్రయంలో దిగారు. ప్రయాణానికి ముందు వీరికి కరోనా టెస్టులు జరపగా అందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. మరోవైపు ఆసీస్లో అడుగుపెట్టినా కూడా వీరంతా నేరుగా తమ కుటుంబీకులను కలుసుకునే వీల్లేదు. నిబంధనల ప్రకారం సిడ్నీ హోటల్లోనే మరో 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే. అలాగే ఈ సమయంలో రెండుసార్లు నెగెటివ్గా తేలాల్సి ఉంటుంది. సిడ్నీ హోటల్లో అయ్యే ఖర్చునుకూడా బీసీసీయే భరిస్తుంది. ఇక కరోనా నుంచి కోలుకున్న సీఎ్సకే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాత్రం భారత్ నుంచి ఖతార్ మీదుగా ఆసీ్సకు వెళ్లాడు.
బీసీసీఐకి సీఏ థ్యాంక్స్
తమ ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశానికి పంపినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపింది. లీగ్ వాయిదా పడగానే ఆసీస్ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది, కామెంటేటర్లను బీసీసీఐ ప్రత్యేక విమానాల్లో మాల్దీవులకు చేర్చింది. ‘మేం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మా ఆటగాళ్లను వేగంగా, భద్రంగా ఇక్కడికి పంపినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు. ఇంకా మా క్రికెటర్లతో మాట్లాడలేదు. కానీ వారంతా ఇప్పుడు ఇంటికి చేరామనే సంతృప్తితో ఉంటారు’ అని సీఏ తాత్కాలిక చీఫ్ నిక్ హాక్లే చెప్పుకొచ్చారు.