‘ఫ్యామిలీ’పై స్పష్టత ఇవ్వండి
ABN , First Publish Date - 2020-08-05T09:21:01+05:30 IST
ఐపీఎల్లో ఆడే క్రికెటర్ల కుటుంబసభ్యులను యూఏఈకి తీసుకెళ్లడంపై ఫ్రాంచైజీలు మరింత స్పష్టత కావాలనుకుంటున్నాయి..
బోర్డును కోరిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఆడే క్రికెటర్ల కుటుంబసభ్యులను యూఏఈకి తీసుకెళ్లడంపై ఫ్రాంచైజీలు మరింత స్పష్టత కావాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి ప్రయాణంతో పాటు సమగ్ర విధి విధానాల (ఎస్ఓపీ)పై కూడా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐని ఫ్రాంచైజీలు కోరాయి. ‘కొన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే హోటళ్లను షార్ట్లిస్ట్ చేసుకోవడంతో పాటుచార్టెడ్ విమానాలను బుక్ చేసుకున్నాయి. ఆగస్టు 20 తర్వాత అక్కడికి వెళ్లనున్నాం. ఈ విషయాలన్నీ అటు ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పంచుకుంటున్నాం. అయితే క్రికెటర్ల కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంపై స్పష్టత కావాలి. ఈ విషయంలో వారు మాపైనే బాధ్యత పెట్టారు. కానీ 53 రోజుల పాటు వారిని బయో బబుల్ వాతావరణంలో ఉంచడం సాధ్యమవుతుందా? ఒకవేళ ఎవరైనా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే సంబంధిత క్రికెటర్పై శిక్ష ఉంటుందా? అనే విషయంలో మాకు స్పష్టత కావాలి. ఎస్ఓపీని అర్థం చేసుకోకుండా ఈ విషయంలో ముందుకెళ్లలేం’ అని ఫ్రాంచైజీల అధికారులు చెబుతున్నారు.