జూలై మధ్యలో ఐపీఎల్?
ABN , First Publish Date - 2020-03-19T09:54:17+05:30 IST
కొవిడ్-19 అదుపులోకి వస్తే రానున్న రోజుల్లో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది. వైరస్ ప్రబలడంతో ఐపీఎల్ను
ముంబై: కొవిడ్-19 అదుపులోకి వస్తే రానున్న రోజుల్లో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది. వైరస్ ప్రబలడంతో ఐపీఎల్ను వచ్చే నెల 15 వరకు బీసీసీఐ వాయిదా వేసింది. కానీ, అప్పుడైనా జరుగుతుందనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ప్లాన్ ‘బి’ని బోర్డు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జూలై-సెప్టెంబరు మధ్య నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై బీసీసీఐ సమాలోచన చేస్తోందని తెలిసింది. ఐసీసీ భవిష్యత్ టూర్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరులో ఆసియా కప్ ఉంటుంది. పాకిస్థాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. దీంతోపాటు జూన్-జూలై మధ్య ‘ద హండ్రెడ్’ సిరీ్సను నిర్వహించడానికి ఇంగ్లండ్ బోర్డు ప్లాన్ చేస్తోంది. ఇంగ్లండ్, పాక్ను పక్కన పెడితే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ జట్లకు ముందుగా నిర్ణయించిన సిరీ్సలేమీ లేవు.
సెప్టెంబరులో ఆసియా కప్ను మినహాయిస్తే.. ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్కప్ వరకు ఒక్క శ్రీలంకతో మాత్రమే భారత్ తలపడనుంది. దీంతో ఆ షెడ్యూల్ను కుదించి ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై బోర్డు సమాలోచన చేస్తోంది. ‘ఐపీఎల్-2009ను 37 రోజులపాటు దక్షిణాఫ్రికాలో నిర్వహించాం. ఇప్పుడు కూడా అలాంటి అవకాశం ఉంటే కొన్ని మ్యాచ్లు భారత్లో కొన్ని విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం లీగ్ను విదేశాలకు తరలించే ఆలోచన కూడా లేకపోలేదు. కానీ, వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిపై ఇదంతా ఆధారపడి ఉంటుంద’ని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. 37 రోజుల విండోలో వారం కోల్పోయే కొద్దీ 9 నుంచి 11 మ్యాచ్లు రద్దయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.