అవే తేదీలు ఖరారు
ABN , First Publish Date - 2020-07-25T06:16:13+05:30 IST
వాయిదా పడుతూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ జరగడం ఇక ఖాయమే. అనుకున్నట్టుగానే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ మెగా లీగ్ జరుగుతుందని ఐపీఎల్....
సెప్టెంబరు 19 నుంచే ఐపీఎల్
లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడి
న్యూఢిల్లీ: వాయిదా పడుతూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ జరగడం ఇక ఖాయమే. అనుకున్నట్టుగానే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ మెగా లీగ్ జరుగుతుందని ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధికారికంగా వెల్లడించాడు. యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబి వేదికలుగా మ్యాచ్లు జరుగుతాయన్నాడు. ‘51 రోజుల పాటు యూఏఈలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. అయితే దేశం వెలుపల జరిగే ఈ టోర్నీకి కేంద్ర ప్రభుత్వం అనుమ తించాలి. టోర్నీకి గ్రీన్సిగ్నల్ లభిస్తుందని ఆశిస్తున్నాం. సెప్టెంబరు 15 లోపే కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా సిరీస్ కూడా ముగుస్తాయి. ఈ దేశాల ఆటగాళ్ల అందుబాటును దృష్టిలో ఉంచుకుని వచ్చేవారం కౌన్సిల్ సమావేశంలో తుది షెడ్యూల్ను ఖరారు చేస్తాం. ఇక యూఏఈ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా అక్కడ రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండాలి’ అని పటేల్ తెలిపాడు.
ఇంటినుంచే...
కరోనా వైరస్తో ప్రపంచమంతా ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని పాటిస్తోంది. క్రికెట్ కూడా ఆ పద్ధతికి జైకొట్టనుంది. త్వరలో జరిగే ఐపీఎల్లో వ్యాఖ్యాతలు ‘వర్క్ ఫ్రం హోం’ చేయనున్నారు. ఈమేరకు ప్రసారకర్త స్టార్స్పోర్ట్స్ ట్రయల్ కూడా వేసింది. సౌతాఫ్రికాలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్కు బరోడా నుంచి ఇర్ఫాన్ పఠాన్, కోల్కతా నుంచి దీప్దాస్ గుప్తా, ముంబై నుంచి సంజయ్ మంజ్రేకర్ తమ నివాసాలలో ఉండే కామెంట్రీ చెప్పారు. ‘ఇదో అద్భుతమైన అనుభవం. స్టార్ క్రికెట్ చక్కటి ప్రయత్నం చేసింది’ అని పఠాన్ చెప్పాడు.